‘హిజ్బుల్’ కమాండర్ హతం

by  |
‘హిజ్బుల్’ కమాండర్ హతం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ దక్షిణ జిల్లా అనంత్‌నాగ్‌లో భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ పోలీసులు, 19 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ ఈ రోజు ఉదయం కుల్‌చోహర్ ఏరియాలో హతమయ్యాడు. మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులూ మృతిచెందారు. ఇందులో ఒకరు జిల్లా కమాండర్ స్థాయిలో ఉగ్రవాది ఉండటం గమనార్హం. ఎన్‌కౌంటర్ స్థలంలో ఏకే రైఫిల్, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దొడా జిల్లా ఉగ్రవాద రహితంగా మారిందని పోలీసు అధికారులు వెల్లడించారు. దొడా జిల్లాలో చివరివరకూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ భద్రతా బలగాల కళ్లుగప్పి తలదాచుకున్నాడు. భట్ మరణంతో ప్రస్తుతం దొడా.. మిలిటెన్సీ బెడద లేని జిల్లాగా మారిందని జమ్ము కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. మసూద్ అహ్మద్ భట్‌పై ఓ రేపు కేసులో నిందితుడుగా ఉన్నాడు. దొడా పోలీసులు ఈ కేసు నమోదు చేసిన తర్వాత భట్ పరారయ్యాడు. అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌కు తన కార్యకలాపాలను విస్తరించుకున్నాడని సింగ్ వివరించారు. పుల్వామాలోని త్రాల్ ఏరియాలోనూ హిజ్బుల్ ముజాహిదీన్ పోలీసులు తుడిచిపెట్టేశారని, దక్షిణ కశ్మీర్ మొత్తాన్ని టెర్రరిజం చెర నుంచి బయటపడేయటమే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఏడాది జమ్ము కశ్మీర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులను ఏరేసినట్టు గతవారం ఈయన పేర్కొన్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed