తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

by  |
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, న్యూస్‌బ్యూరో: పింఛనుదార్ల విషయంలో ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అపిడవిట్‌పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు కొన్ని గంటల ముందు అపిడవిట్‌ను సమర్పించడంపై తీవ్రంగా స్పందించింది. గంటల వ్యవధిలోనే ఆ అఫిడవిట్‌ను చదివి విచారణ చేయడం సాధ్యమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్ కాలంలో పెన్షనర్లకు ప్రతీ నెలా చెల్లించే పింఛనులో 25% మేర ప్రభుత్వం కోత విధించడానికి సంబంధించి బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పింఛనుదార్లు ఉన్నారని, వారికి నెలవారీ పింఛను చెల్లింపుల్లో 25% కోత అమలవుతోందని, పూర్తిగా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో బాధితులు పేర్కొన్నారు.

దీనిపై వాదనల సందర్భంగా పింఛనులో కోత విధించడంపై వివరణ ఇస్తూ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. ఉదయంపూట కౌంటర్ దాఖలు చేసి వెంటనే విచారణ ప్రారంభం కావాలంటే ఎలా సాధ్యమని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. గంటల వ్యవధిలోనే దాన్ని చదివి విచారణ జరపడం సాధ్యమేనా అని నిలదీసింది. దీనికి స్పందించిన అడ్వొకేట్ జనరల్ రెగ్యులర్ కోర్టు పనిదినాలు ప్రారంభమైన తర్వాత విచారించాలని సూచించింది. దీనిపై అటు హైకోర్టు డివిజన్ బెంచ్, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా విచారణ జరగాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.

కోర్టు సైతం వీడియో కాన్ఫరెన్సు ద్వారానే విచారిస్తామని, రెగ్యులర్ కోర్టులు పనిచేసేంతవరకు ఆపలేమంటూ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.


Next Story

Most Viewed