తిరుమలలో వైభవంగా హంసవాహన సేవ

by  |
తిరుమలలో వైభవంగా హంసవాహన సేవ
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి మలయప్పస్వామి హంసవాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. హంస వాహన సేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి.

ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్లన గ్రోవితో ముర‌ళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వజస్తంభం వ‌ర‌కు స్వామివారిని చిన్న శేష వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు. మధ్యాహ్నం శ్రీ‌వారి ఆల‌యంలో ఎండు ద్రాక్ష, వక్కలు, ప‌సుపు కొమ్ముల‌‌తో ప్రత్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్నపనతిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్రత్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ గోవిందాచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్నపన తిరుమంజ‌నంలో వివిధ‌ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు భ‌క్తుల‌ను క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండ‌గా, ప్రత్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌‌వారం ఉదయం 9గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.


Next Story

Most Viewed