ప్రైవేటైనా.. పబ్లికైనా.. కనిపిస్తే కబ్జానే!

by  |
ప్రైవేటైనా.. పబ్లికైనా.. కనిపిస్తే కబ్జానే!
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇంకే ముంది వాటిని ఆక్రమించేందుకు అక్రమార్కులు పోటీపడుతున్నారు. అధికారుల అండదండలు, అధికార పార్టీ నాయకుల సపోర్టుతో వాటిని చేజిక్కించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ మహిళా డిగ్రీ కళాశాల భూమి సైతం కబ్జాకు గురైనట్టు తేలింది. కానీ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాత్రం భూమిని ఆక్రమించిన వారిలో తన సొంత తమ్ముడు ఉన్నా శిక్ష పడాల్సిందేనంటూ చెబుతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా భూ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కందనూలుకు పేరుంది. ఇక్కడ ప్రభుత్వ భూముల‌తో పాటు వేలాది ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిని అదునుగా భావించి కొందరు ఇక్కడి భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. వీరికి కొందరు అధికార పార్టీ నేతలు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ భూముల పెరుగుతుండటంతో ఇక్కడి భూమిల ధర గజం వేలల్లో పలుకుతోంది. దీనికి తోడు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం అమాంతం పుంజుకుంది. వాటితో పాటు భూములు ధరలు సైతం పెరిగాయి. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలంతా సిండికేట్‌గా మారి ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కేసరి సముద్రం, నాగ సముద్రం చెరువు శిఖం భూములు, కుంటలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాటిని ప్లాట్లుగా మారుస్తున్నారు. వివాదాస్పద భూములను సైతం అధికారుల అండదండలతో చట్టబద్ధంగా అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందడంతో పరిసర గ్రామాలైన ఎండబెట్ల, ఉయ్యాలవాడ, ఇటిక్యాల, నెల్లికొండ గ్రామాలను జిల్లా కేంద్రంలో విలీనం చేశారు. దీంతో ఆ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల‌తో పాటు చెరువు శిఖం భూములు, కుంటలను సైతం ప్లాట్లుగా మార్చుతున్నారు అక్రమార్కులు. తాజాగా నాగర్‌కర్నూల్ మహిళా డిగ్రీ కళాశాల భూమి 5:11 గుంటల భూమిని రియల్టర్లు కబ్జా చేయడంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖల సంయుక్త నివేదికలో ఈ విషయం బయటపడింది. అందులో విలాసవంతమైన ఫామ్ హౌజ్‌లను సైతం నిర్మించారు. కానీ వీటిని అధికారులు తొలగించకుండా ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా డిగ్రీ కళాశాల భూ వివాదంలో అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ తయారు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. దీనిని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఖండించారు. చెరువు శిఖం, ప్రభుత్వ భూముల అక్రమణలో తన సొంత తమ్ముడు ఉన్నా ఉపేక్షించేది లేదని ఇటీవలే ఆయన స్పష్టం చేశారు.

నూతన రెవెన్యూ చట్టంతో ఆగుతాయా?

భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్టు సీఎం చెబుతున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి దీంతో నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో జరుగుతున్న భూ ఆక్రమణలకు చెక్ పడుతుందా? లేదా? అని పలువురు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం‌లో భాగంగా ప్రతి సెంటు భూమిని సైతం రీ సర్వే చేసి హద్దులను నిర్ణయించనున్నారు. వాటి సమాచారాన్ని ధరణి వెబ్ సైట్ లో పొందుపరుచనున్నారు.

కళాశాల భూములపై సర్వే..

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల భూమి ఆక్రమణకు గురైన విషయం బయటికి పొక్కడంతో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించి కళాశాల భూమి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. దీంతో జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వేయర్ రాఘవేందర్ తదితర సిబ్బంది సర్వే చేపట్టారు. కళాశాలకు రెండు విడతలుగా ప్రభుత్వం అందించిన ఐదెకరాల 11 గంటల భూమిని సర్వే చేసేందుకు వాటికి ఆనుకొని ఉన్న భూముల యజమానులకు (51 మందికి) నోటీసులు జారీ చేశారు. సర్వే పూర్తిగా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు నివేదించినట్టు సర్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


Next Story