స్కిల్ ఇండియా మిషన్ ఉపయోగించుకోవాలి

by  |
స్కిల్ ఇండియా మిషన్ ఉపయోగించుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ‘స్కిల్ ఇండియా మిషన్’ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఈ పథకాలు వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకతను చదువులో మొదటి నుంచి గుర్తించాలని గవర్నర్ సూచించారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని తమిళిసై అన్నారు. ‘ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్’కు సంబంధించిన అడ్వయిజరీ ఆన్‌లైన్ సమావేశంలో శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యారంగంలో కొవిడ్ అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించినా.. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ ద్వారా మనం వాటిని అధిగమించామన్నారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలు, ఆలోచనలతో ప్రాక్టికల్ క్లాసులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించాలన్నారు. శిక్షణ, ఉన్నత నైపుణ్యాల కోసం కృషి నిరంతరం ఉన్నప్పడే విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ ఆర్గలైజేషన్ ఆఫ్ తమిళ్ ఆరిజిన్ (గోటో) సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. తమిళనాడులోని వివిధ విశ్వవిద్యాలయాలు వైస్-ఛాన్సలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



Next Story