వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ఫండ్!

by  |
వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ఫండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ వారిని ఆదుకునేందుకు ప్రత్యేక అగ్రి ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఫండ్‌ను రూ. లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చెప్పారు. దీనికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ సౌకర్యాల కోసం స్టార్టప్‌లు, అగ్రిటెక్, రైతు సంఘాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ .1 లక్ష కోట్ల‌తో ఈ నిధిని ఏర్పాటు చేయనున్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో అగ్రి ఫండ్ కూడా ఒక భాగం. కేబినెట్ ఆమోదం తర్వాత మీడియాతో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ “ఇది చారిత్రక నిర్ణయం. వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగు పరుస్తుంది’ అని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పీవోలు), వ్యవసాయ రంగంలోని ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్‌లు, అగ్రి-టెక్ ప్లేయర్‌లకు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేయనున్నట్టు ఆయన వివరించారు. అలాగే, అగ్రి ఫండ్‌లో భాగంగా శీతల గిడ్డంగులు, వేర్‌హౌస్‌లు, ఈ-మార్కెటింగ్ పాయింట్లు, ఈ-ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ లాంటి వాటిని నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు.


Next Story

Most Viewed