టీఆర్ఎస్ నాయకులవి పగటి కలలు : రాజాసింగ్

by  |
టీఆర్ఎస్ నాయకులవి పగటి కలలు : రాజాసింగ్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై బీజేపీ పక్షాన గళాన్ని వినిపిస్తానని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు నీట మునిగాయని, వారికి ఇవ్వాల్సిన నష్ట పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఆదివారం గన్ ఫౌండ్రీలో బీజేపీ నాయకుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్‌కు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశా వర్కర్లను ఆయన సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతామని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు మాట్లాడేందుకు సరిగా సమయం ఇవ్వడం లేదని, మూడు నిముషాల్లో, సుమారు 15 అంశాలపై ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన రాకముందే టీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని రాజాసింగ్ స్పష్టంగా చేశారు.


Next Story

Most Viewed