‘గ్యాస్ లీకేజీని అరికట్టాం.. ఊపిరిపీల్చుకోండి’

by  |
‘గ్యాస్ లీకేజీని అరికట్టాం.. ఊపిరిపీల్చుకోండి’
X

దిశ ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో అమ్మోనియా నుంచి సీవో 2 తయారు చేసే క్రమంలో గ్యాస్‌ లీక్ ఘటన స్ధానికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి మొత్తం అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ…

ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్స్ ఇండస్ట్రీలో ఈ ఉదయం 2 టన్నుల సామర్థ్య మున్న అమ్మోనియా గ్యాస్ ట్యాంకర్ నుంచి సీవో 2ను తయారు చేస్తుండగా పైప్‌లైన్ వద్ద లీకేజీ ఏర్పడింది. దీంతో అమ్మోనియా గ్యాస్ పరిశ్రమ చుట్టూ వ్యాపించింది. ఆ సమయంలో కంపెనీలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో గ్యాస్‌ను పీల్చిన కంపెనీ జనరల్ మేనేజర్ (జీఎం) శ్రీనివాస్ రెడ్డి (50) మృతిచెందారు. పైప్‌లీకేజీ కారణంగా గాయపడిన ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాధమిక చికిత్స అందించారు.

ఘటన గురించి తెలియగానే కలెక్టర్ వీరపాండియన్ రంగంలోకి దిగారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖలను రంగంలోకి దించారు. పరిశ్రమలు, అగ్నిమాపక శాఖలు గ్యాస్ లీకేజీని సరిచేస్తే..పోలీసు శాఖ చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేసింది. రెవెన్యూ శాఖ నష్టం తీవ్రతను అంచనా వేసింది. వైద్య ఆరోగ్య శాఖ క్షతగాత్రులకు చికిత్స నందించింది. ఈ క్రమంలో గ్యాస్ పరిశ్రమ గోడలు దాటలేదని, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లీకేజీని అరికట్టామని ప్రకటించారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.


Next Story

Most Viewed