ప్రజలంతా ఫిక్స్.. కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

by Disha Web Desk 19 |
ప్రజలంతా ఫిక్స్.. కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజలంతా ఫిక్స్ అయ్యారని, ఎన్నికలు జరగడమే ఆలస్యమని ఆయన వివరించారు. మంగళవారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.. మోడీ, అమిత్​షాల ఆదేశాల మేరకే గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు వచ్చారన్నారు. రాజస్థాన్‌లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలని, లేదంటే ముక్కు నేలకు రాయాల్సిందేనని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందన్నారు.

కోడ్ ఉల్లంఘిస్తున్నా, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. అమ్మవారి పేరుతో కూడా కులాలు ఉన్నాయని, గుర్తింపు లేని ఈ కులాలకు కూడా రాహుల్ గాంధీ అండగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాహుల్‌కు అండగా ఉన్నారనే భయంతోనే మోడీ కాంగ్రెస్‌‌ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

ఫస్ట్ టైమ్ ఆర్ఎస్ ఎస్ చీఫ్​మోహన్ భగవత్‌ను కూడా రిజర్వేషన్లపై నోరు మెదిపే లాగా రాహుల్ గాంధీ చేశాడన్నారు. స్వయంగా అమిత్ షా గాంధీ భవన్‌కి ఢిల్లీ పోలీసులను పంపించాడండే బీజేపీ ఏ మేరకు భయపడుతుందో..? అర్ధం అవుతుందన్నారు. మోడీ పదేళ్లు ప్రధానిగా ఉండి, అబద్ధాలు ఆడటం భావ్యమా..? అంటూ ప్రశ్నించారు. అబద్ధాలను నిజం అన్నట్టు మోడీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. తాళి బొట్టు తెంచి ముస్లింలకు ఇస్తారని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

ఒక్క ఆధారమైనా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మోడీకి అబద్ధాలు చెప్పి ట్రైనింగ్ ఇస్తున్న ప్రొఫెసర్ ఎవరు..? క్రిమినల్ మైండ్‌తో పవర్ కోసం దిగజారుడు అవసరమా..? అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్‌పై విమర్శలు చేస్తే డైలీ టీవీలో కనిపించవచ్చనే ఆశతో హరీష్​రావు నిత్యం ఫైర్ అవుతున్నాడని జగ్గారెడ్డి తెలిపారు. ఎప్పుడైన బీజేపీ కాంగ్రెస్ కలిసిందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అంటూ ఎద్దేవా చేశారు.

ఆదిలాబాద్ నేతలకు కాంగ్రెస్ కండువా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ రెడ్డిలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతంలో పని చేయాలని సూచించారు. కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్‌ను తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed