సీఎం.. మా కోరిక తీర్చండి

by  |
సీఎం.. మా కోరిక తీర్చండి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ప్రజల కష్టాల్లో పాలకులు పాలుపంచుకోవాలని హితవు పలికారు. తమ జాతి సమస్య తీర్చేలా ప్రధాని మోడీని సీఎం జగన్‌ కోరాలని విజ్ఞప్తి చేశారు. అడిగిన వారికి, అడగని వారికి, ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు, అని అమలు చేసి జగన్ దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, అయితే, తమ జాతి చిరకాల కోరికను నెరవేర్చడం లేదని ఆయన చెప్పారు.

తమకు బీసీ రిజర్వేషన్‌ల విషయంపై 2016లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాపుల కోరిక సమంజసం అని జగన్ చెప్పారని తన మిత్రులు చెబితే విన్నానన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై జగన్ మద్దతు ఇచ్చారని తెలిసిందన్నారు. కానీ ఈరోజు తమ కోరికను తీర్చడానికి జగన్‌కు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు జరగకముందు ప్రతిరోజు నాటి సీఎం చంద్రబాబు తమ జాతిని, ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులతో చేయించిన దమనకాండ, అరాచకాలు, అవమానాలను వైసీపీ తమ ఛానెల్‌లో చూపించిందే చూపించిందని, తమ జాతి సానుభూతి, ఓట్లు పొందిందని చెప్పారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిలా పూజలందుకోవాలే గానీ, పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని జగన్‌కు సూచించారు. దయచేసి తమజాతి సమస్య తీర్చేలా, భారత ప్రధాని గౌరవ మోదీ గారిని కోరాలని జగన్‌ను కోరుకుంటున్నానని చెప్పారు.


Next Story

Most Viewed