అక్కడ కరోనా తోకముడిచింది!

by Shamantha N |
అక్కడ కరోనా తోకముడిచింది!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హుబెయి ప్రావిన్స్‌లో తొలిసారిగా వెలుగుచూసిన కోవిడ్ మహమ్మారి ఇప్పుడు అక్కడ తోకముడిచినట్టు తెలుస్తున్నది. రెండు నెలలుగా దిగ్బంధనంలో ఉంటున్న ఆ ప్రావిన్స్.. ఇప్పుడు కరోనా కోరల నుంచి దాదాపుగా విముక్తి పొందే దశకు చేరుకున్నది. చైనాలో నమోదైన సుమారు 81 వేల కరోనా కేసుల్లో సింహభాగం ఈ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. అటువంటిది కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి (దాదాపు మూడు నెలల నుంచి) తొలిసారిగా బుధవారం ఈ ప్రావిన్స్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకు ముందు ఐదు రోజులు స్థానికంగా వెలుగు చూసిన కేసుల కంటే అధికంగా విదేశాల నుంచి వచ్చినవారిలోనే ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది.

హుబెయి ప్రావిన్స్‌లో బుధవారం ఒక్క అనుమానిత కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఒక్క కొత్త కేసూ లేదు. ఐసోలేషన్‌ వార్డుకు తరలించినవారి సంఖ్య శూన్యంగానే ఉన్నది. బుధవారం ఈ వైరస్ కారణంగా ఎనిమిది బాధితులు మరణించారు. ఇప్పుడు 6,636 మంది కరోనా బాధితులు ఈ ప్రావిన్స్‌లో ఉన్నారు. వారందరూ ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

చైనాలోని 34 ప్రావిన్స్‌లలో హుబెయి ప్రావిన్స్ ఒకటి. ఈ ప్రావిన్స్‌లోని వుహాన్‌ సిటీలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించింది. ఇప్పుడు 158 దేశాలకు పాకిన ఈ వైరస్ బారిన దాదాపుగా 2.18 లక్షల మంది పడ్డారు. సుమారు 8,800 మంది బలయ్యారు. ఇంతటి కల్లోలాన్ని సృష్టిస్తున్న ఈ కరోనా.. హుబెయి ప్రావిన్స్‌లో సమసిపోతున్నది.

Tags: coronavirus, covid 19, hubei province, wuhan, no fresh cases, first time

Next Story