రాలిన వంగపండు

by  |
రాలిన వంగపండు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండుకు జానపద కళాకారుడిగా, విప్లవ కవిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది.

మూడు దశాబ్దాలకు పైగా ప్రజలను చైతన్యపరిచేలా వంగపండు వందలాది జానపద పాటలు రచించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడారు. అంతేకాదు.. తనపాటలతో పల్లెకారులతోపాటు గిరిజనులను చైతన్యపరిచారు. గద్దర్ తో కలిసి 1972లో ఆయన జననాట్యమండలిని స్థాపించారు. వంగపండును ఉత్తరాంధ్ర గద్దర్ గా పిలుస్తారు. 1943 జూన్ లో పెదబొండపల్లిలో వంగపండు జన్మించారు. జగన్నాధం, చినతల్లి ఈయన తల్లిదండ్రులు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ అనే పాటతో ఉర్రూతలూగించిన వంగపండు అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. ఈయన రచించిన పాటలు ఇంగ్లీష్ భాషలో డబ్బింగ్ చేయబడ్డాయి. అనంతరం ఆ పాటలు ఇతర దేశాల్లో కూడా ఉర్రూతలూగించాయి. ప్రసాదరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు సంతాపం తెలుపుతున్నారు.


Next Story