గోదావరి బేసిన్‌లో పెరిగిన వరద

by  |
గోదావరి బేసిన్‌లో పెరిగిన వరద
X

దిశ, న్యూస్‌బ్యూరో: గోదావరి బేసిన్‌లో వరద పెరిగింది. పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మంగళవారం నుంచి మరింత పెరిగింది. ప్రస్తుతం 3,389 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా 4 టీఎంసీలకు చేరింది. ఇక ఎస్సారెస్పీకి 3,152 క్యూసెక్కులు వస్తుండగా నీటి నిల్వ 32టీఎంసీలు దాటింది. మరోవైపు ఎల్లంపల్లికి కూడా 610 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. పెరూరు దగ్గర 31వేల క్యూసెక్కులు వస్తుండగా, ధవళేశ్వరం దగ్గర ఇన్‌ఫ్లో 40వేల క్యూసెక్కులు నమోదవుతోంది. కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో ఎల్లంపల్లికి వదిలే అవకాశాలున్నాయి.

మరోవైపు కృష్ణా బేసిన్‌లో వరదలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎగువన ఆల్మట్టికి 29,231 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో 75.89 టీఎంసీల నీటి నిల్వకు చేరింది. కాల్వలు, దిగువనకు 1,130 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు స్థానిక వరద కొనసాగుతోంది. 4,423 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను 8టీఎంసీలకు చేరింది. దీంతో బీమా, నెట్టెంపాడు, సమాంతర కాల్వల నుంచి 1,460 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇక తుంగభద్రకు 2,532 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా స్థానిక వరద వస్తోంది. 1,074 క్యూసెక్కులు వస్తుండగా, 1,678 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. సాగర్‌ జలాశయానికి కూడా వెయ్యి క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టాలో 6,997 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైంది.


Next Story