జియోమార్ట్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్!

by  |
జియోమార్ట్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి తర్వాత మిగిలిన రంగాలతో పోలిస్తే ఈ-కామర్స్ రంగం బాగా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ వాల్‌మార్ట్ ఇండియాలో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా దేశీయ దిగ్గజం రిలయన్స్ అనుబంధ సంస్థ జియోమార్ట్‌కు పోటీగా నిలవాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ టు బిజినెస్ విభాగాన్ని రివర్ ఆక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ బిజినెస్‌ను సొంత చేసుకున్నట్టు గురువారం వెల్లడించింది. దీని తర్వాత కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను ప్రారంభించనుంది. ఈ నిర్ణయంతో భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని పూర్తిగా మార్చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కిరాణా వ్యాపారంలో ఉన్న పోటీతో పాటు, ఇటీవల రిలయన్స్ సంస్థ జియోమార్ట్‌తో మార్కెట్‌ను శాసించే పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగష్టులో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను ప్రారంభిస్తామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలను సేవలందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ విభాగానికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి ఆదర్శ్ నేతృత్వం వహిస్తారని కంపెనీ వెల్లడించింది. కొద్దికాలం వాల్‌మార్ట్ ఇండియా సీఈవో సమీర్ అగర్వాల్ సంస్థతోనే కొనసాగుతారని తెలుస్తోంది. భారత మార్కెట్లో రిటైల్ వ్యాపారానికి సంబంధించి కిరాణా దుకాణాలు, ఎంఎస్ఎంఈలు కీలకమైన విభాగంలో ఉండనున్నాయి. టెక్నాలజీ, లాజిస్టిక్ అవసరాలతో పాటు చిన్న వ్యాపారులకు ఆర్థికంగా ఊతమివ్వడం, వినియోగదారుల అవసరాలను వేగంగా అందించడం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఉద్దేశ్యమని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. భారత రిటైల్ మార్కెట్లో ఇది కీలక అడుగని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెకెనా పేర్కొన్నారు.


Next Story

Most Viewed