ద్వేషాన్ని సొమ్ము చేసుకుంటున్న ఫేస్‌బుక్?

by  |
ద్వేషాన్ని సొమ్ము చేసుకుంటున్న ఫేస్‌బుక్?
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పుడు సమాచారం విషయంలో, ద్వేషపూరిత కంటెంట్ విషయంలో ఫేస్‌బుక్ మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఆ విమర్శలన్నీ నిజమేనని చెప్పే విషయమొకటి బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలో ద్వేషాన్ని పుట్టించి దాని మీద ఫేస్‌బుక్ సొమ్ము చేసుకుంటోందని ఆ సంస్థ నుంచి ఇటీవల రాజీనామా చేసిన ఓ ఉద్యోగి వెల్లడించం గమనార్హం. అతని రాజీనామకు అది కూడా ఒక కారణమని తెలియజేస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అశోక్ చంద్వానీ ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా, మిలిటెంట్‌ల గ్రూప్‌ల ఈవెంట్లను తొలగించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఆయన ఆరోపించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ద్వేషపూరిత పోస్ట్‌ను ఫేస్‌బుక్ ప్రోత్సహించడం తనకు నచ్చలేదని అశోక్ పేర్కొన్నారు.

ఇలాంటి ఉద్దేశాలతోనే చాలా మంది ఫేస్‌బుక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్చివేత పోస్టును తాము డిలీట్ చేయబోయేది లేదని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన వారం రోజుల్లో ముగ్గురు రాజీనామా చేశారు. వీళ్లు రాజీనామా చేస్తూ ఫేస్‌బుక్ రహస్యాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ కావాలని ద్వేషాన్ని రెచ్చగొడుతోందని, తద్వారా కలహాలు రేపి డబ్బులు సంపాదించుకునే యత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అశోక్ చంద్వానీ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌తో పాటు కేంబ్రిడ్జి అనాలిటిక్స్ వ్యవహారం, రష్యా ఎన్నికల్లో అంతరాయం వంటి పాత ఆరోపణలను కూడా పూసగుచ్చాడు. ఇదంతా ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారానే అశోక్ తెలియజేశారు. కేవలం అమెరికా దేశాన్ని మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ద్వేషాన్ని పెంచి పోషించేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోందంటూ అశోక్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిలో ఎంత నిజముందో తెలియదు కానీ, ఉద్యోగులు ఇలా రాజీనామా చేస్తుంటే కొద్దిగా నమ్మకం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story