నవయుగ కవి చక్రవర్తి జాషువా! గురించి తెలుసా?

by Ravi |
నవయుగ కవి చక్రవర్తి జాషువా! గురించి తెలుసా?
X

రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు' అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటి చెప్పిన కవి గుర్రం జాషువా. ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో తన రచనలు కొనసాగించారు జాషువా. ప్రజలలో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిల్చారు.

కవి‌సామ్రాట్ గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాని వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం వీరయ్య-లింగమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో విద్యాభాస్యంలో అనేక కష్టాలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. తండ్రి యాదవ కులం, తల్లి మాదిగ కులానికి చెందినవారు.

అనేకానేక రచనలు

జాషువా అనేక రచనలు చేశారు. ఖండకావ్యాలు రాశారు. వాటిలో గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర అతి ముఖ్యమైనవి. లఘుకావ్యాలు కూడా ఉన్నాయి. ఫిరదౌసి కావ్యంలో వేదన కనిపిస్తుంది. పర్షియన్ చక్రవర్తి గజినీ మహ్మద్ ఆస్థానంలోని కవి ఫిరదౌసి. 'మాటకొక బహుమానం ఇస్తానని' రాజు చెబితే పదేళ్లు శ్రమించి మహాకావ్యం రాస్తాడు. చివరికి అసూయాపరుల మాటలు విని రాజు ఇచ్చిన మాటను తప్పుతాడు. ఆవేదనతో ఆ కవి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వేదనను తానే స్వయంగా అనుభవించినట్లుగా రాశారు జాషువా. తనలోని ఆవేదనలు సమాజానికి తెలియపరచడమే తన రచనల సారాంశమని చెప్పడానికి ఇది నిదర్శనం. జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను వెతికి, దానికి గల కారణాలను పరిశీలించి, అనేక కోణాలలో ఆలోచించి తన కవిత్వ మార్గాన్ని ఎంచుకున్నారు.

'గబ్బిలం' కావ్యం అందుకు నిదర్శనం. దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం 'గబ్బిలం' రాశారు. ఇది కాళిదాసు 'మేఘసందేశం' తరహాలో సాగుతుంది. కావ్యంలో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు. అతడు తన గోడును సమాజానికి వినిపించడమే కావ్యాంశం. 'నాదు కన్నీటి కథ సమన్వయము సేయనార్ద్ర హృదయంబు గూడ కొంతవసరంబు' అని గబ్బిలం గురించి జాషువా వాపోయాడు. ఉత్తమ జాతి పక్షులనబడే హంసలు, పావురం, చిలుకలను పక్కకు తీసి సమాజంలోకి అతి వేగంగా దూసుకుపోయేలా 'గబ్బిలం' కవి కళ్లకు దళితంగానే కనిపించింది.

దళిత వేదనలు

ఆ కాలంలో దళితులకు తిండి, బట్ట తో పాటు స్వేచ్ఛా జీవనం కూడా దుర్భేద్యంగా ఉండేది. 'కఠిన చిత్తుల దురాగములు ఖండించి కనికర మొలకించు కులము నాది' అందుకే 'నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయును' అని గర్జించాడు. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీసి విప్లవమూర్తిగా సాక్షాత్కరించాడు. 'పంచమ కులం ఎక్కడుంది?' అని నిలదీసాడు. 'ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాను గాని, వసరమునకన్న హీనుడు భాగ్యుడు, యైదవ కులస్థుడెవరమ్మా' అని ఆవేదన చెందారు. తన పద్యాలను దళిత సాహిత్యానికి మార్గదర్శకంగా నిలిపారు. 'ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి యినుప గజ్జెల తల్లి జీవనము సేయు గసరి బుసగొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు' అని హిందుత్వాన్ని నిరసించారు.

'విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు' అని చాటి చెప్పారు. కష్టజీవి గురించి చెబుతూ 'వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు' అంటారు. 'చిక్కిన కాసుచే దనివిజెందు నమాయకుడెల్ల కష్టముల్, బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి, నల్దిక్కులు గల్గు లోకమున ధిక్కరియున్న యరుంధతీ సుతుండొక్కడు, జన్మమెత్తె భరతోర్వరకుం కడగొట్టు బిడ్డడై' అనే పద్యం కష్టజీవి కష్టాలను వివరించారు.

ఎన్నో పురస్కారాలు

గుర్రం జాషువాకు 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాలు అందించింది. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి బిరుదులు కూడా అందుకొన్నారు. జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణ కనిపిస్తాయి. అతని రచనలలో కసిగానీ, ద్వేషంగానీ లేదు. ప్రతిఘటన మాత్రమే ఉంది. సత్య హరిశ్చంద్ర నాటకం 'శ్మశానవాటిక' ఘట్టంలో కవి హృదయం ఈ విధంగా ఘోషిస్తుంది.

'ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనఁగఱగిఁపోయె! యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రికలంతరించె! యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూసల సౌరు గంగలోఁగలిసిపోయె! యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు' అంటూ జీవిత సత్యాన్ని వివరించారు. సమాజ మార్పు కోసమే జాషువా విశేష సాహిత్య సంపదను సృష్టించారు. 'ఈ సమాజం ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉంటే బాగుంటుందనే' వరకు ఆయన కవిత అజరామరంగా ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉంటుంది.

(నేడు గుర్రం జాషువా జయంతి)


కందుకూరి దేవదాసు

డీటీఎఫ్, వరంగల్

99499 37745

Advertisement

Next Story

Most Viewed