న్యాయదీపం ధర్మ తీర్పు!

by Ravi |   ( Updated:2024-08-03 01:00:24.0  )
న్యాయదీపం ధర్మ తీర్పు!
X

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలు అన్ని రంగాల్లో నేటికీ ఇంతటి ఆధునిక యుగంలో అట్టడుగులోనే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి అట్టడుగున ఉన్న మాదిగలతో పాటు ఉపకులాలకు న్యాయం జరగాలని ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలై మూడు దశాబ్దాలు అయింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు చరిత్ర మరువని వర్గీకరణ తీర్పును వెలువరించింది. ఉపకులాల అభివృద్దికి ఎస్సీ వర్గీకరణ అవసరమనే తీర్పును వెలువరిస్తూ ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

మూడు దశాబ్దాలుగా సాగి‌న వర్గీకరణ పోరా‌టంలో ఎంతో మంది అసువులు బాశారు. ఎన్నికల ముందు ప్రతీ రాజకీయ పార్టీ మా దిగల డిమాండ్ ఎస్సీ వర్గీకరణను సమర్దిస్తూనే తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయి. ఎస్సీలో ఉన్న అసమానతలపై అనేక కమిషన్లను గత ప్రభుత్వాలు నియమించాయి. 1998లో రామచంద్రరాజు కమిషన్ సైతం ఎస్సీ వర్గీకరణ అవసరమని చెప్పింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2000ల సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది. ఫలితంగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మాదిగ, ఇతర ఉపకులాల ప్రాతినిధ్యం పెరిగింది. కాగా కేవలం నాలుగు సంవత్సరాల తరువాత సుప్రీంకో ర్టుకు వెళ్లడంతో 2004లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరించే అధికారాన్ని తొల గించింది. ఫలితంగా మళ్లీ వర్గీకరణ ఉద్యమం అలుపులేకుండా సాగింది.

అలుపెరుగని పోరాటం..

జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, 1997 ఎస్సీ లను నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కొక్కరికి విడివిడిగా రిజర్వేషన్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలలో ఎలాంటి రిజర్వేషన్ ప్రయోజనాలను పొందకుండా షెడ్యూల్డ్ కులాల క్రీమీ లేయర్‌ను మినహాయించాలని కూడా సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బిహార్‌లలో అత్యంత బలహీన దళితులకు ప్రత్యేక కోటాలను ప్రవేశపెట్టారు. 2007లో బిహార్‌లో వెనుకబడిన ఎస్సీలలోని కులాలను గుర్తించేందుకు మహాదళిత్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తమిళ నాడులో, ఎస్సీ కోటాలో 3% కోటా అరుంధతీరాయ్ కులానికి కేటాయించారు. కాగా 2007లో నియమించిన జస్టిస్ ఉషామెహ్ర కమిషన్ సైతం వర్గీకరణకు అనుకూలమైన రిపోర్టు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు చొరవ చూపలేదు. దీంతో ఇన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం సాగింది.

ఉమ్మడి రిజర్వేషన్‌తో నష్టం!

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద సామాజిక వర్గంగా తెలంగాణలో 2014 నాటికే మాదిగల జనాభా 12 శాతానికి చేరినట్లు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ద్వారా అర్థం అవుతుంది. దళితులకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు, ఉపకులాలు నష్టపోతున్నారు. కాగా తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ సర్కా రు స్పష్టమైన హామీని ఎన్నికల సమయంలో ఇచ్చింది. అయినప్పటికీ పదేళ్లు పట్టించుకోలేదు‌. మరో పక్క పార్లమెంటు సమావేశాల్లో‌నూ నాటి టీఆర్ఎస్ ఎంపీలు అనేకసార్లు వర్గీకరణపై ప్రశ్నించారు. గత ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేశారు. ఎట్టకేలకు ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు సానుకూల తీర్పునిచ్చింది. ఎస్సీ కులాల్లోనూ ఇంకా వెనుకబాటులో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు చరిత్రలో ఎప్పటికీ ధర్మబద్ధమైనదిగా నిలవనున్నది. రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఇస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. మూడు దశాబ్దాల ఆకాంక్ష సాకారానికి ఈ తీర్పు సాక్షీభూతంగా నిలవనుంది.

వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు

ఎస్సీ వర్గీకరణకు తామంటే తాము అనుకూలమంటూ ఓట్లు వేయించుకున్న పార్టీలు.. మాదిగల ఆవేదనను సరిగా అర్థం చేసుకోలేకపోయాయి. ఫలితంగా జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉండి ఉద్యోగ, విద్య, ఉపాధి రంగాల్లో మాదిగ, ఉపకులాలు ఆమడ దూరంలో ఉండి అంధకారంలోనే ఉండిపోయాయి. ఒక జాతి సమస్యను పరిష్కరించడానికి.. మూడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఆ వర్గం మరెంత వెనుకబాటుకు గురైందో అర్థం చేసుకోవచ్చు. ఏదైమైనా, ఎవరి వాటా వారికి దక్కాలనే సామాజిక పోరాటంలో ఉన్న న్యాయం గెలవడంతో మాదిగ, ఉపకులాలకు సామాజిక సమానత్వానికి ఇప్పటికైనా మార్గం ఏర్ప డింది. వర్గీకరణ ఏ ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదు. కేవలం సామాజిక వెనుకబాటు నుంచి సమానత్వం వైపు తేవడానికే ఈ తీర్పు అనేది గమనించాలి.

మాదిగల పల్లెల్లో వెలుగులు..

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల వరకు మాదిగలు అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నా విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబాటులోనే ఉన్నారు. ప్రస్తుతం పార్ల మెంట్ ద్వారా చట్టం ఉండాలనే నిబంధనను కొట్టివేసి.. ఎస్సీ వర్గీకరణ అమలు బాధ్యత రాష్ట్రాలకే అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడం శుభ పరిణామం. తరతరాలు వెనుకబాటుకు గురవుతున్న మాదిగలకు ఈ తీర్పు గొప్ప సంబురమనే చెప్పవచ్చు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మాదిగలు, ఉపకులాల వారికి మెరుగైన అవకాశాలు దక్కే అవకాశం ఉంది. తెలంగాణలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం దళితుల జీవితాల్లో ఓ శుభపరిణామంగా చెప్పవచ్చు. ధర్మాస నం ఇచ్చిన తీర్పు ప్రతీ మాదిగ పల్లెల్లో వెలుగులు తీసుకువచ్చింది. మాది గల ఆవేదనకు శాశ్వత పరిష్కారం చూపిన రాజకీయ పక్షాలకు, సామాజికవాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

-సంపత్ గడ్డం

మాదిగ విద్యార్థి నాయకుడు

78933 03516

Advertisement

Next Story

Most Viewed