- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పతనం అంచున పాకిస్తాన్...!

నేడు 24 కోట్ల జనాభాతో ప్రపంచంలో ఐదవ అత్యధిక జనాభా గల దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆసియా ఖండంలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ల తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అంతర్జాతీయ సహకారం కోసం పాకిస్తాన్ ఆశగా ఎదురుచూస్తోంది. భారతదేశం కంటే ఒకరోజు ముందుగా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతుంటే, భారత్ మాత్రం ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ప్రపంచంలో తన ప్రస్థానాన్ని బలోపేతం చేసుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద స్థావరంగా మారి రాజకీయ అస్థిరతతో అవినీతితో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థతో దేశ ప్రజలకు కనీస అవసరాలు కూడా కల్పించలేని దేశంగా ఆర్థిక సంక్షోభంలోకి కురుకుపోతున్న ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభం దిశగా
భారత ఉపఖండంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మరువక ముందే మరొక దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్నట్లుగా కనిపిస్తుంది రోజురోజుకీ అడుగంటి పోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, వేగంగా పతనమవుతున్న పాకిస్తాన్ రూపాయి విలువ, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెద్ద ఎత్తున పెరిగిన విదేశీ రుణ భారం కారణంగా... పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోంది. గత ఏడాది 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిలువలు ప్రస్తుతం 5.6 బిలియన్ డాలర్లకు చేరుకొని మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థాయికి విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోయాయి. దీంతో గ్యాస్, పెట్రోలియం ఇంధనం వంట నూనెలు లాంటి వస్తువులను దిగుమతి చేసుకోటానికి పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం 42 శాతానికి చేరుకోవటంతో వంట నూనెలు గోధుమపిండి నెయ్యి లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి వంట నూనెలను అత్యవసర వస్తువుల జాబితా నుండి తొలగించారు. 15 కిలోల గోధుమపిండి బ్యాగ్ ధర రూ. 2050లకు చేరుకుంది. అలాగే కిలో ఉల్లిపాయల ధర 2022 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం వివిధ వస్తువుల పైన ఇచ్చేటటువంటి సబ్సిడీలు తొలగించడం వలన వినియోగ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సబ్సిడీ పైన ప్రభుత్వం ఇచ్చే గోధుమపిండి కోసం ప్రజలు పడిగాపులు కాయడమే కాదు మరికొన్ని చోట్ల తొక్కిసలాటలు కూడా జరుగుతున్న ఉదంతాలు కనపడుతున్నాయి
పాకిస్తాన్లో ఒకవైపు ఆర్థిక సంక్షేభం మరొకవైపు ఆహార సంక్షోభం భవిష్యత్తులో తలెత్తే అవకాశం కనబడుతోంది. రష్యా నుండి నాలుగు లక్షల 50 వేల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం వలన ఆహార సంక్షోభాన్ని అధిగమిస్తామని పాకిస్తాన్ భావిస్తోంది. కానీ రాబోయే రంజాన్ మాసం నాటికి ఆహార కొరత పాకిస్తాన్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. డాలర్తో పాకిస్తాన్ రూపాయి మారకం విలువ రూ. 227లుగా రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది ఇంధనం, పెట్రోలు, గ్యాస్ లాంటి కీలకమైన వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి పోవటం వలన పాకిస్తాన్ ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలకు ఉపక్రమించింది. దీంట్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర గంటలకే మార్కెట్ల మూసివేత పది గంటలకే రెస్టారెంట్లు ఫంక్షన్ హాల్ల మూసివేత లాంటి చర్యలు చేపట్టిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2021 నాటికి పాకిస్తాన్ అప్పులు 29 లక్షల 51 వేల కోట్ల రూపాయలకి చేరుకోవటంతో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుండి, మిత్ర దేశాల నుండి కొత్త అప్పులు పుట్టని స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి ద్రవ్య సంస్థలు అప్పు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
రాజకీయ అస్థిరతే కారణమా
పాకిస్తాన్లో ఇంతవరకు ఏర్పడిన పౌర ప్రభుత్వాలన్నీ సైన్యం చెప్పు చేతులలో ఉంటూ, వారి దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి పనిచేయటం వలన రాజకీయ అస్థిరతతో ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే, ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధికారంలోకి రావడానికి ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ రాజకీయాలలో మునిగి తేలటం కూడా పాకిస్తాన్ ప్రస్తుత స్థితికి కారణంగానే భావించాలి.పాకిస్తాన్ పాలకులు బెనజీర్ భుట్టో, ఆసిఫ్ అలీ జార్దారి, నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముష్రాఫ్, ఇమ్రాన్ ఖాన్... ఇలా అందరి పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల వరకు ఆ దేశ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ బాజ్వాపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి అంటే పాకిస్తాన్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్ళూనుకుపోయిందో అర్థమవుతుంది. పాలకుల అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. పాలకులు పాకిస్తాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చటం, ఆఫ్గన్ పరిణామాలు ప్రతికూలంగా మారటం, కాశ్మీర్లో ఉగ్రవాద ప్రేరిత కార్యకలాపాలకి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, భారత్ నుండి భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది అనే అపోహలతో రక్షణ రంగంపై అవసరానికి మించి బడ్జెట్లో ఖర్చు చేయడం, చైనా నుండి పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవడం వంటి కారణాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీశాయి.
ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు భారత్పై తమ గుడ్డి వ్యతిరేకతను పక్కనపెట్టి వ్యాపార, రక్షణ, శాంతి, ఆర్థికపరమైన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటే అంతర్జాతీయంగా కలిసి వస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో స్నేహ సంబంధాలు ఆర్థిక సంబంధాలు వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకోకపోతే పాకిస్తాన్ మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడటానికి 30 బిలియన్ డాలర్లు అవసరమవుతుందని రాబోయే ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వృద్ధిరేటు కేవలం రెండు శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా. కాబట్టి ఆర్థిక సంక్షోభం మరింత ముదరకముందే పాక్ ప్రభుత్వం మరికొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక పరిణామాలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారత్పై కూడా పడే అవకాశం ఉంది. దాయాది పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని ఆశిద్దాం.
డాక్టర్ తిరునహరి శేషు
ఆర్థిక విశ్లేషకులు, కేయూ
9885465877
Also Read....