ఇరకాటంలో మోడీ!

by Ravi |
ఇరకాటంలో మోడీ!
X

"కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుంది" అన్నది లోకోక్తి. 2014లోనూ, 2019లోనూ బీజేపీని విజయ శిఖరాలకు చేర్చిన మోడీ రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో పార్టీనీ, ప్రభుత్వాన్ని శాసించి ప్రధాని హోదాలో ఏకఛత్రాధిపత్యం అనుభవించాడు." తాను ఆడింది ఆట పాడింది పాటగా" ఆయన పరిపాలన కొనసాగింది. 2024లో మూడోసారి బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఇండియా కూటమితో పాటు బీజేపీ మూలం అయిన ఆరెస్సెస్ నుంచి గత కొంతకాలంగా మోడీపై పరోక్షంగా విమర్శల జడివాన కురుస్తోంది. ముఖ్యంగా ''ఆశకు అంతులేదు. మనిషి ఇంకా ఇంకా కోరుకుంటాడు. కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. అక్కడితో ఆగిపోరు. భగవంతుడిగా మారాలని కోరుకుంటారు'' భగవత్ చేసిన తాజా వ్యాఖ్య మోడీకి చెంపపెట్టులా అయిందని జనాంతికం.

ఆరంభంలో ఆరెస్సెస్ మూలాలనుండి మోడీ ఎదిగి వచ్చినా అధికారంలో ఏకపక్షంగా స్థిరపడినప్పుడు, బీజేపీని ఆరెస్సెస్ ఛాయ పడకుండా బలమైన స్వేచ్ఛాయుత పాలన కొనసాగించారు. గతంలో వాజపేయి,ఎల్.కే. అద్వానీ ,మురళీ మనోహర్ జోషి మొదలైన అగ్రశ్రేణి నాయకులు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా ఆరెస్సెస్ సిద్ధాంతాలకు, ఆరెస్సెస్ నాయకత్వానికి వీరవిధేయత ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలలోనూ, ప్రభుత్వ నిర్వహణలోనూ సంఘపరివార్ సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పాలన సాగించారు. అయితే మోడీ వీరికి భిన్నంగా తనదైన ముద్రతో పాలన సాగించారు. ఒకవైపు అనాదిగా ఆరెస్సెస్ ఏ లక్ష్యాలను, ఆశయాలను కలిగి ఉందో వాటిని క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా ఆచరణ సాధ్యం చేస్తూ మోడీ తనదైన స్వీయ శైలితో ముందుకు సాగారు. ఆ సమయంలో ఆరెస్సెస్ కూడా మోడీ శైలిని బాహాటంగా విమర్శించలేదు. పైగా హర్షించింది.

ఆరెస్సెస్‌ అవసరం లేదా!

కానీ మూడోసారి తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురాగలననే అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి మోడీ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగటాన్ని ఆరెస్సెస్ జీర్ణించుకోలేకపోయింది. పైగా మోడీ కేబినెట్ మినిస్టర్లు కొందరు ఆరెస్సెస్‌తో బీజేపీకి సంబంధం లేదని, ఈ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా వాటి, వాటి పరిధుల్లో పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. అంటే బీజేపీ ఆరెస్సెస్‌పై ఆధారపడి, సంప్రదింపులు జరుపుతూ నిర్ణయాలను తీసుకోదని, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటూ పాలన చేస్తుంది అనే అర్థంలో వారు మాట్లాడారు. మంత్రుల మాటలు, బీజేపీ జాతీయ నాయకుడు నడ్డా మాటలు ఆరెస్సెస్‌ను తీవ్రంగా నొప్పించాయి. మోడీ ఏకపక్ష నిర్ణయాలు, బహిరంగంగా ఎన్నికల సభలలో చేసిన ఉపన్యాసాలు భగవత్‌ను బాధించాయి. మూడో సారి ఎన్నికల్లో ఆరెస్సెస్ కార్యకర్తల ప్రమేయం లేకుండా బీజేపీ ఒంటరిగా స్వశక్తి పై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది.

భగవంతుని ప్రతినిధివా?

కానీ ఎన్నికల ఫలితాలు ఆశించినట్లు రాకపోవడంతో మోడీ ప్రభుత్వం నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో ప్రభుత్వాన్ని నడపవలసి రావడంతో ఆరెస్సెస్ నాయకులకు మోడీపై, బీజేపీపై పరోక్షంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించడానికి అవకాశం లభించింది. ఆరెస్సెస్ అధికార పత్రిక పాంచజన్యలోనూ మోడీ ఒంటెద్దు పోకడలపై సూటి పోటీ మాటలు రువ్వుతూ వ్యాసాలు వెలువడ్డాయి. గతంలో పుణేలో ఆరెస్సెస్ నూతన కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ...భగవత్ ములుకుల్లాంటి పలుకులతో బీజేపీ అగ్రనాయకుల వ్యవహార శైలిపై సునిశిత విమర్శలు చేశారు. ఇప్పుడు రెండోసారి మోడీ వ్యక్తిగతంగా ఇంటర్వూలలో తన గురించి తాను 'బయోలాజికల్‌గా తన తల్లికి జన్మించినా... స్వయంగా భగవంతుని ప్రతినిధిగా మహత్కార్యాలు చేయడానికి ఈ భూమిపై అవతరించినట్లు' చెప్పుకున్న మాటలను వ్యంగంగా అపహాస్యం చేస్తూ భగవత్ పరోక్షంగా మోడీపై వ్యాఖ్యనాలు గుప్పించారని కాంగ్రేస్ నాయకులు, దేశ ప్రజలు భావిస్తున్నారు.

మానవాతీత ప్రధాని

ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. జార్ఖండ్‌లోని బిష్ణుపూర్‌లో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 'ఆశకు అంతులేదు. మనిషి ఇంకా ఇంకా కోరుకుంటాడు. కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. అక్కడితో ఆగిపోరు. భగవంతుడిగా మారాలని కోరుకుంటారు. కానీ భగవంతుడు తనను తాను సర్వాంతర్యామిగా చెప్తారు. ఆ విశ్వరూపుడిని మించింది ఇంకా ఏదైనా ఉందా అనేది ఎవరికీ తెలీదు. కార్యకర్తలు దీనిని అర్థం చేసుకోవాలి' అని అన్నారు. అయితే, భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ అంటున్నది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ... 'మా అమ్మ చనిపోయిన తర్వాత నేను దైవాంశ సంభూతుడిని అని నాకు అనిపించింది. నాకు ఈ శక్తులను భగవంతుడే అందించాడు. నేను ఆ దేవుని దూతనే తప్ప మరొకటి కాదు' అని అన్నారు. దీన్ని ఉద్దేశించే భగవత్ వ్యాఖ్యానించినట్లు, లోక్ కల్యాణ్ మార్గ్ లక్ష్యంగా జార్ఖండ్ నుంచి నాగపూర్ పేల్చిన తాజా అగ్ని క్షిపణి గురించిన వార్త... స్వయం ప్రకటిత మానవాతీత ప్రధానమంత్రికి తెలిసే ఉంటుంది' అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.


Read more...

దేశ భవిష్యత్ తరగతి గదిలోనే...!



డా. కిషోర్ ప్రసాద్,

98493 28496



Next Story