శ్రమ బీసీలది.. సంపద వాళ్ళకు

by Ravi |   ( Updated:2024-09-03 01:00:57.0  )
శ్రమ బీసీలది.. సంపద వాళ్ళకు
X

ఏ సమానత్వ సమాజంలోనైనా అన్ని వర్గాల మధ్య అధికారం సమానంగా పంచబడాలి. ‘మెజార్టీ ఈజ్ లా’ అన్నప్పుడు మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం ఎలా విజయం సాధించగలుగుతుంది? ఎస్సీ, ఎస్టీలకు 14% , 7% రాజకీయ రిజర్వేషన్ల మూలన రాష్ట్రపతి, ఉపప్రధాని, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి పదవుల దాకా వారికి వెళ్లే అవకాశం ఏర్పడింది. అయితే జనాభాలో మెజారిటీగా 56% ఉన్న బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేనందున వల్లనే నేటికీ ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నామన్న ఆవేదన ప్రతి బీసీ కులాల హృదయాల్లో ఉంది. వీరికి రాజకీయ పాలనాధికారం కేవలం ముఖ్యమంత్రులుగానో, మంత్రులుగానో పని చేయడం ద్వారా మాత్రమే కాదు.. రాజకీయంగా చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల వాటా పొందినప్పుడే మాత్రమే నిజమైన అభివృద్ధి జరుగుతుంది.

దేశంలో ఉన్న దాదాపు 2600 బీసీ కులాల్లో స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంట్, అసెంబ్లీలోలలో అడుగు పెట్టాయి. పార్లమెంటులో 15% కూడా బీసీల బలం లేదు. ఇందులో యూపీ, బిహార్, తమిళనాడు నుంచి మాత్రమే బీసీ ఎంపీలు ఎక్కువ. 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. మొదటి నుంచి కూడా చాలా ప్రధాన పార్టీలు వీరికి కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్య, ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు కల్పించడం, కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకుని వదిలేస్తున్నాయి. ఇలాంటి జిమ్మిక్కులు బీసీల సమస్యలను పరిష్కరించలేవు. బీసీల వెనుకబాటుతనాన్ని తొలగించవు. రాజకీయ సీట్ల రిజర్వేషన్లు బీసీలకు అధికారానికి ప్రవేశ ద్వారం. కాబట్టి బీసీలకు రాజకీయ స్థానాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి. వెనుకబడిన తరగతులకు సీట్లు రిజర్వ్ చేయకపోవడంతో బీసీ అభ్యర్థులు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రకులాల అభ్యర్థులతో పోటీ పడలేక మధ్యలోనే అపజయాలను మూటగట్టుకున్నారు.

కనీస అవసరాలు పొందలేక..

భారతదేశంలోని అగ్రవర్ణాల బిలియనీర్లు మాత్రం బాగా అభివృద్ధి చెందుతుండగా, మరోపక్క భారతదేశంలోని పేదలు ముఖ్యంగా బీసీ కులాలు జీవించడానికి కనీస అవసరాలు కూడా నేటికీ కూడా పొందలేకపోతున్నారు. భారతీయ అసమానతలపై 2023 ఆక్స్‌ఫామ్ నివేదిక చూస్తే సాధారణ పరిశీలన శక్తి ఉన్న ఎవరికైనా ఆశ్చర్యం కలిగించదు. భారతదేశ జనాభాలో 1 శాతం మంది జాతీయ సంపదలో 40.5 శాతం కలిగి ఉన్నారు. దేశంలోని మొత్తం వస్తువుల, సేవల పన్ను (జీఎస్‌టీ)లో దాదాపు 64% జనాభా దిగువన ఉన్న 50% ప్రజల నుండి వచ్చింది. అయితే 4% మాత్రమే టాప్ 10% నుండి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. దేశంలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా 228.9 మిలియన్ల మంది పేదలు ఉన్నారు. భారతదేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 నుండి 2022 నాటికి 166కి పెరిగింది. మహమ్మారి నవంబర్ 2022 వరకు ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద రోజుకు 121 శాతం లేదా రూ. 3,608 కోట్లకు పెరిగింది. భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లకు చేరుకుంది. అనగా ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌కు ఒక ఏడాదిన్నర బడ్జెట్‌కు పూర్తి నిధులు అందించగలదు.

పెరిగిపోతున్న అసమానత్వం..

భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగానే కాదు, అత్యంత అసమాన దేశాలలో కూడా ముందున్న దేశంగా పరిగణిస్తారు. దేశంలోని అట్టడుగు సంపదకు చెందిన వారిలో అత్యధిక శాతం అట్టడుగు వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. భారతదేశంలో ఆరోగ్య వ్యయం భారీగా పెరిగిపోతోంది. వైద్య ఖర్చులు, పాఠశాల విద్యను భరించగలిగే స్తోమత, కుటుంబ సామర్థ్యం లేకుండా పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. వనరుల అన్యాయమైన పంపిణీ, సామాజిక, ఆర్థిక అసమానతలు, వారసత్వం ద్వారా సృష్టించబడిన సంపదలో అధిక భాగాన్ని ధనవంతుల చేతుల్లోకి వెళ్లిపోవడం వల్ల బీసీ పేదలు ఇప్పటికీ కనీస వేతనం కూడా సంపాదించలేక పోతున్నారు. దోచి దాచిపెట్టే అవినీతి రాజకీయ వ్యవస్థల ములంగా బీసీల బతుకులు ఆగమాగం అవుతున్నాయి. పెరుగుతున్న ఈ అంతరాలు, అసమానతలు అసహనానికి దారితీసే పెను ప్రమాదం లేకపోలేదు.

వాటా లేకపోతే ఎదగలేరు..

విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారు. ఈ భారీ వివక్షను తొలగించేందుకు వెనుక బడిన తరగతులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయడం అధికారం, హోదాను అనుభవించడం కోసం కాదు. వెనుకబడిన తరగతులు ధనిక ఉన్నత వర్గాలతో పోటీ పడాలని చెప్పడం. సహజ న్యాయం కోసం పోటీ ఇద్దరు సమానుల మధ్య ఉండాలి. అసమానతల మధ్య కాదు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే, వారు అభివృద్ధి చెందలేరు. సామాజికంగా, ఆర్థికంగా పురోగమించలేవు. ఆకలితో, పేదరికంతో బాధపడుతున్న వెనుకబడ్డ ప్రజలు, సమాజంలో వారి దీర్ఘకాల సమాన వాటాను కలిగి ఉండటం, జనాభాలో 56% ఉన్న వెనుకబడిన తరగతులు చట్టాల నిర్ణయంలో పాల్గొనడం ఏకైక అంతిమ లక్ష్యం సాధించేందుకు చట్టసభల్లో ప్రాతినిధ్యం చాలా అవసరం. లేకుంటే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా వెలుగొందాలన్న లక్ష్యం నెరవేరదు.

డాక్టర్. బి. వి. కేశవులు నేత. ఎండీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Advertisement

Next Story

Most Viewed