వర్గీకరణ రాజకీయ ఆయుధమైతే..

by Ravi |   ( Updated:2024-08-04 00:46:02.0  )
వర్గీకరణ రాజకీయ ఆయుధమైతే..
X

దళితులకు, ఆదివాసీలకు అందుతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న వర్గీకరణ విషయమై ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన తీర్పు ఎంతో ప్రాధాన్యత కలది. విద్యా, ఉద్యోగాల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్న దళితులు, ఆదివాసీల్లో అన్ని ఉపకులాలకు సమానమైన మేలు కలగడం లేదు కాబట్టి ఆయా వర్గాలని గ్రూపులుగా విభజించి ఫలాల్ని పంచాలని, అలా విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నది సుప్రీం తీర్పు. ఈ భావన గత తీర్పులకు భిన్నమైనది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం, దళితులైనా, ఆదివాసులైనా రాజ్యం దృష్టిలో ఒకే గ్రూపు (హోమో జనస్) అని, అలా విభజించే అధికారం ఎవరికీ లేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో అలా జరిగిన వర్గీకరణ చెల్లుబాటు కాదంది. ఇప్పుడు సుప్రీం తీర్పు వర్గీకరణకు అనుకూలం. తీర్పు వెనకనున్న స్పూర్తిని అర్థం చేసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

వివాదాలకు ఆస్కారం లేకుండా..

ఎందుకంటే వర్గీకరణ ఒక రాజకీయ, భావోద్వేగ అంశం. వందల కులాలున్న గ్రూపులో, లబ్ధి పొందడంలో కొన్ని ముందు వరుసలో ఉండగా, కొన్ని బాగా వెనకబడి ఉండడం అన్నది వాస్తవం. అందుకనే ప్రభుత్వం ఆదివాసీల్లో వెనుకబడి ఉన్న వారిని పీటీజీలుగా గుర్తించి, వారి అభివృద్ధికి అదనపు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలకు అందుతోన్న రిజర్వేషన్లను గ్రూపులో కులాల వారిగా ఇవ్వాలనుకుంటే, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని రీతిలో, సరియైన ఆధారాలతో, పక్కా గణాంకాలతో వెనుకబాటుతనాన్ని నిర్ధారించాలి. ఆ వర్గీకరణ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చేదిలా ఉండకూడదు. న్యాయమైనదిగా అందరికీ అనిపించాలి. రాష్ట్ర స్థాయిలో తమ అధికార పరిధిలో లేని విషయాల్లోనే (కొత్తగా కొన్ని కులాల్ని జాబితాలో చేర్చడం లాంటివి) హామీలిచ్చే పార్టీలు, తమ పరిధి లోకి వచ్చిన అంశాన్ని (ఉన్న జాబితాలో గ్రూపుల్ని మార్చడం) రాజకీయ ఆయుధంగా మార్చుకోవా? అన్నది ప్రశ్న. అలా అయితే అసలు స్ఫూర్తి పక్కకెళ్లి, వారిలో వారికి అంతర్గత వివాదాలు అధికమవుతాయి.

డా. డి వి. జి. శంకర రావు,

మాజీ ఎంపీ,

94408 3691

Advertisement

Next Story

Most Viewed