గనులు సింగరేణికే కేటాయించండి!

by Ravi |   ( Updated:2024-07-06 00:30:16.0  )
గనులు సింగరేణికే కేటాయించండి!
X

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం -1973 చట్టాన్ని రద్దు చేసింది. ‘ కమర్షియల్ మైనింగ్’ ప్రాతిపదికన బొగ్గు గనులను కేటాయించే ప్రక్రియను 2020 జనవరి 18న వేలం ద్వారా ప్రారంభించింది. ఈ వేలం ఇప్పటివరకు 9సార్లు జరిగింది. ఈ వేలం పాటల్లో 107 బొగ్గు బ్లాక్‌లను అమ్మివేశారు. 2024 జూన్ 21న పదో విడత వేలం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటికే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి బొగ్గు గనులైన సత్తుపల్లి -3, కోయగూడెం బ్లాక్‌లను 2022లో ప్రైవేట్ వారికి వేలం పాటలో అమ్మి వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత వేలం పాటలోనూ సింగరేణి ప్రాంతంలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం పెట్టారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రిని బొగ్గు గనుల నిబంధన ప్రత్యేక చట్టం 2015 సెక్షన్ (అ ) ప్రకారం, రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు గనులను సింగరేణి కంపెనీకే కేటాయించాలని ఆ శాఖ మంత్రిని, ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల కేంద్ర ప్రభుత్వం అందుకు అనుకూలంగా లేనట్లు తెలుస్తుంది. కిషన్ రెడ్డి, ఖనిజాల అభివృద్ధి చట్టం -2015, సెక్షన్ (10బి ) ప్రకారం బొగ్గు గనులను వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ వైఖరి మూలంగా..

2015లో కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి దేశంలో ఉన్న నూతన బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు ఇవ్వకుండా ప్రైవేట్ వారికి వేలం ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపింది. పైగా గతంలో సింగరేణిని బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా చేసింది. ఆ వేలంలో దక్కించుకున్న రెండు బొగ్గు బ్లాక్‌లైన కోయగూడెం ఓసిపి- 3, సత్తుపల్లి ఓసిపి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అరబిందో, అవంతిక అని ప్రైవేట్ కంపెనీలు పొందేలా చేసింది. అయితే బొగ్గు గనులు దక్కించుకున్న ఆ కంపెనీలు ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదని అందుకే ఆ కంపెనీలను రద్దు చేసి ఆ గనులను కూడా సింగరేణికి ఇచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే లేఖ రాసింది. అలాగే ఇప్పుడు వేలం పాట చేపట్టిన శ్రావణపల్లి బొగ్గు గనిని రిజర్వేషన్ ఆధారంగా సింగరేణికే కేటాయించాలని కోరింది.

వేలం పాటను నిరసిస్తూ..

తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికే చెందే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగంగా నిన్నటి నుంచే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే 8 నుంచి 12 తారీఖు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్షా కార్యక్రమాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చాయి.

-ఉజ్జిని రత్నాకర్ రావు

ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

949095 2646

Advertisement

Next Story

Most Viewed