మళ్లీ విజృంభిస్తోన్న ఎబోలా, నలుగురు మృతి

by  |
మళ్లీ విజృంభిస్తోన్న ఎబోలా, నలుగురు మృతి
X

దాదాపు రెండేళ్ల తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మళ్లీ విజృంభించింది. కాంగో వాయవ్య భాగంలో కొత్తగా ఆరుగురికి ఎబోలా వైరస్ సోకగా, వారిలో నలుగురు ఇప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. కొవిడ్ 19 నుంచి కోలుకోక ముందే ఇలా పాత వైరస్ మళ్లీ తెరమీదికి రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మబాండక నగరంలో ఎబోలాతో నలుగురు చనిపోయారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఎటనీ లాంగోండో స్పష్టం చేసిన అనంతరం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎబోలా మళ్లీ బయటపడిందని అధికారికంగా ప్రకటించింది. చివరగా ఈ నగరంలో జులై 2018న ఎబోలా బయటపడింది. అప్పుడు ఈ వ్యాధి 33 మంది ప్రాణాలను బలితీసుకుంది.

అయితే గతంలో ఎబోలాను కట్టడి చేసిన అనుభవం ఉన్నందున వీలైనంత వేగంగా తాము ఈ వైరస్‌ను ఈసారి కూడా నియంత్రిస్తామని ఎటనీ లాంగోండో తెలిపారు. 2019లో 28000 కేసులు బయటపడగా మొత్తం 11000 మంది చనిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించింది. ముఖ్యంగా మనుషులకు, ప్రాథమిక జీవులకు పాకే ఈ ఎబోలా మొదటిసారిగా 1976లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా నది పరిసరప్రాంతాల్లో బయటపడింది. తర్వాత ఇది దాదాపు ఆఫ్రికా దేశాలన్నింటికీ వ్యాపించి తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, అలసట, కండరాల నొప్పి, గొంతు నొప్పితో ప్రారంభమై డయేరియా, మలంలో రక్తం వచ్చి చనిపోతారు.


Next Story