ప్రాణహిత తీరంపై డ్రోన్​ నిఘా..!

by  |
ప్రాణహిత తీరంపై డ్రోన్​ నిఘా..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మన్యంలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. అగ్రనేత భా స్కర్ కోసం మూడు నెలలుగా పోలీసులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. కడంబా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు పట్టు బిగిస్తున్నారు. నలువైపులా గ్రేహౌండ్స్ బలగాలతోపాటు అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్​గఢ్​రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి ఆ పార్టీ అగ్రనేత భాస్కర్ టార్గెట్​గా పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. దట్టమైన అభయారణ్యాలు ఉన్న ఈ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేతకు డ్రోన్ కెమెరా తో పహారాకు దిగారు. ఈ ఆపరేషన్‎ను స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు ప్రాణహిత నదీ పరీవాహక, దట్టమైన అటవీ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో అణువణువూ జల్లెడ పడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులను ఆనుకొని ఉన్న అంతర్రాష్ట్ర బోర్డర్‎లను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు జనారణ్యంలోకి వచ్చే అవకాశం లేకపోలేదన్న సమాచారం మేరకు మైదాన ప్రాంతాలపై కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా చెన్నూరు నుంచి మహారాష్ట్రలోని సిరివంచ వెళ్లే రహదారిపై, కాగజ్ నగర్-అహెరీ రహదారిపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎన్​కౌంటర్​లో తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్ల తో నిఘా పెంచారు. పెంచికల్ పేట్, సిద్దేశ్వర గుట్ట, లోడ్ పెల్లి, చింతల్ మానే పల్లి, గూడెం ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నక్సల్స్ ఏరివేతలో సిద్ధహస్తుడిగా పేరున్న మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఈ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ మహేందర్ రెడ్డి కుమర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కడంబా ఎన్​‎కౌంటర్ కూడా ఆయన నేతృత్వంలోనే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల ఆనుపానులు తెలియడంతో పాటు, యాంటీ నక్సల్స్ ఏరివేతలో పోలీసు శాఖలో పేరొందిన ఉదయ్ కుమార్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించిన తర్వాత మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

కొన్నాళ్లుగా మావోయిస్టుల కోసం పోలీసులు చేస్తున్న ఆపరేషన్ ఆదివాసీ గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది అమాయక గిరిజన కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. గతంలో తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లోనూ ఇంతటి ఒత్తిడిని తాము ఎదుర్కోలేదని అక్కడి ఆదివాసులు చెబుతున్నారు. అలాగే కాగజ్​నగర్​ డివిజన్​లోని బెజ్జూర్, దహేగాం మండలాల అటవీ గ్రామాల ప్రజలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఈ భయానక వాతావరణం ఇంకెంతకాలం ఉంటుందన్న ప్రశ్న ఆ ప్రాంత వాసుల్లో నెలకొంది.



Next Story

Most Viewed