ఇకపై DM, DAOలుగా కలెక్టర్లు..!

by  |
ఇకపై DM, DAOలుగా కలెక్టర్లు..!
X

దిశ, న్యూస్ బ్యూరో: కలెక్టర్.. ఇదేం దిక్కుమాలిన పదం. ఎక్కడైనా కలెక్ట్ చేస్తున్నారా? శిస్తు వసూలు చేస్తున్నారా? ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తోంది. ఇంకా ఈ పనికి మాలిన విధానం ఎందుకు? అందుకే కలెక్టర్ అనే పదాన్ని మార్చేస్తాం.. అంటూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రసంగించారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగానే దాదాపు ఆ పదాన్ని నిషేధిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిపాలనా విధానంలో ‘కలెక్టర్’, ‘రెవెన్యూ’ అనే పదాలు లేని వ్యవస్థను రూపొందించారు. శతాబ్దాలుగా కొనసాగిన రెవెన్యూ శాఖ కనుమరుగు కానుందని సమాచారం. సరికొత్త పిలుపుతో మరికొద్ది రోజుల్లోనే జనం ముందుకు రానుంది. ఎలాగూ జిల్లా కలెక్టర్ హోదా, పిలుపును మార్చేస్తారని తేలిపోయింది. అలాగే జిల్లా కలెక్టర్ హోదాను ఇప్పటికే ఉన్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా జన బాహుళ్యంలోకి తీసుకురానున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్లను డీఎం( డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్)గానే పిలుస్తారు. ఇదే పదాన్ని ఖాయం చేసేటట్లు కనిపిస్తోంది. అంటే ఇదేం కొత్తది కాదు. ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఆయన గది ముందు జిల్లా మెజిస్ట్రేట్ అనే హోదా కలెక్టర్ అనే పదంతో పాటే ఉంటుంది. అయితే ఆ కలెక్టర్ అనే ఉచ్ఛారణను పూర్తిగా నిషేధించనున్నారు. కేవలం DMగానే బాధ్యతల నిర్వహణ చేపట్టనున్నారు. కానీ మరో విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(DAO)గానూ పిలిచేందుకూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

మొత్తంగా రేపటి నుంచి జిల్లా కలెక్టర్‌ను డీఎం‌గా లేదంటే డీఏవోగా పిలవనున్నారు. అదే తరహాలో ఆయనకే విశేషాధికారాలను కట్టబెట్టనున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో అన్ని శాఖల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని కీలకమైన బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతి పనికీ, ప్రతి పథకానికీ ఆయనే పూర్తి బాధ్యత వహించనున్నట్లు తెలుస్తోంది. డీఎం లేదా డీఏవో ఆధ్వర్యంలో ప్రతి శాఖ పని చేయనుంది. మొత్తంగా ఇప్పటి కలెక్టర్ ఆ జిల్లాకు సర్వాధికారాలు కలిగిన అధికారిగా చెలామణి కానున్నరన్న మాటే.

రెవెన్యూకు కొత్త పేరు..

దేశవ్యాప్తంగా భూములకు సంబంధించిన శాఖకు రెవెన్యూగానే పేరుంది. కానీ తెలంగాణలో భూములకు గానీ, ఇతర ఏ వ్యవసాయ అనుబంధానికి పన్నుల వసూళ్ల ప్రక్రియ లేదు. ఇక కలెక్ట్ అనే పదానికి చోటే లేదు. రెవెన్యూ కలెక్షన్ అనేదే లేనప్పుడు భూములకు సంబంధించిన శాఖకు రెవెన్యూ అనే పేరెందుకని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. దీంతో శతాబ్దాల నుంచి కొనసాగుతోన్న రెవెన్యూ శాఖకు మంగళం పలకనున్నట్లు సమాచారం. దాని స్థానంలో సరికొత్త పేరుతో కొత్త శాఖ ఆవిర్భవించనుంది.

అలాగే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్(అదనపు కలెక్టర్), ఆర్డీవో, తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్వో.. వంటి సీక్వెన్స్‌కు స్వస్తి పలకనున్నారు. మరికొంత మార్పులతో కొత్త వ్యవస్థకు రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రక్రియకు ఆమోదముద్ర వేసేందుకు ‘ల్యాండ్ రెవెన్యూ యాక్టు’లో సవరణలు తీసుకురావాలి. అయితే మొన్నటి కేబినేట్ సమావేశంలో చర్చించలేదు. కానీ ఏర్పాటు ప్రక్రియకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు అధికార వర్గాల్లో వినిపిస్తోంది.


Next Story

Most Viewed