‘మత్తు’లో హత్య… నిందితుల అరెస్టు..!

by  |
‘మత్తు’లో హత్య… నిందితుల అరెస్టు..!
X

దిశ ప్రతినిధి, వరంగల్: గంజాయి మత్తులో మేనత్తను హత్య చేసిన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల 71 వేల నగదు, మూడు సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ టైలర్ స్ట్రీట్‎లో నివాసముంటున్న దోర్నం శారద.. కూరగాయలు విక్రయిస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. శారద అన్న కొడుకు కరీమాబాద్ కు చెందిన ఆడెపు ఆకాశ్ బాబు.. గత కొద్దికాలంగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆకాశ్‎ను తండ్రి మందలించడంతో మేనత్త శారదా ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం పొందాడు. ఈ క్రమంలో శారద తాను సంపాదించిన డబ్బును బీరువాలో భద్రపరచడాన్ని ఆకాష్ గమనించాడు. చెడు వ్యసనాలకు డబ్బు లభించక పోవడంతో మేనత్త ఇంట్లో దొంగిలించాలని పథకం పన్నాడు. ఈ నెల 3న తెల్లవారుజామున మేనత్త ఇంటి వెనుక తలుపు తీసివుండడంతో లోపలికి ప్రవేశించి.. మెలకువతో వున్న మేనత్తపై బండరాయితో తలపై పలుమార్లు కొట్టి హత్య చేశాడు. అనంతరం నిందితుడు బీరువాలోని బంగారు నగలు, డబ్బును చోరీ చేసి పరారయ్యాడు. ఆకాష్ మిగతా ఇద్దరు నిందితులను సంప్రదించడంతో ఆశ్రయం కల్పించారు. ఈ మేరకు ఆకాశ్ చోరీ చేసిన సొమ్ములో మైనర్‎కు రూ. 51వేలు, మరో వ్యక్తికి ఒక లక్ష 50 వేలు ముట్టజెప్పినట్లు సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు.

Read Also…

కెనాల్‌లో AE మృతదేహం లభ్యం..



Next Story

Most Viewed