కిక్కిచ్చే.. తండ్రీకొడుకుల కానుక!

by  |
కిక్కిచ్చే.. తండ్రీకొడుకుల కానుక!
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలామంది పిల్లలు పుట్టాక వారి చదువులకో లేదా పెళ్లి కోసమో డబ్బులు జమచేస్తూ ఉంటారు. ఆ చిన్న మొత్తాలు కాస్తా.. వారు పెరిగి పెద్దయ్యే సరికి పెద్ద మొత్తంగా మారి ఉపయోగపడతాయి. ప్రతీ మధ్యతరగతి కుటుంబంలోనూ ఇది జరిగే విషయమే. అయితే, ఇప్పుడు ఓ కొత్త తరహా ‘సేవింగ్’ గురించి వింటే ఆశ్చర్యపోతారు.

అదేంటంటే.. ఓ తండ్రి, తన కొడుకు పుట్టినప్పటి నుండి అతనికి 28 ఏళ్లు వచ్చే వరకు.. ప్రతి ఏటా పుట్టినరోజున తప్పనిసరిగా ఒక బహుమతి ఇచ్చేవాడు. ఆ కానుక ఏంటంటే… ‘విస్కీ’ ఫుల్ బాటిల్. ఇలా మొత్తంగా 28 ఏళ్లు వచ్చేసరికి 28 బాటిల్స్ పోగయ్యాయి. ఈ తరహా సేవింగ్ బహుశా ఎక్కడా విని ఉండరు. మరి ఆ కుమారుడు వాటితో ఏం చేశాడు? తిరిగి ఆ తండ్రికి ఎలాంటి బహుమతి ఇచ్చాడు? తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ టాంటన్‌కు చెందిన మాథ్యూ రాబ్సన్ 1992లో జన్మించాడు. కొడుకు పుట్టిన సంతోషంలో అతని తండ్రి పీట్.. తొలిసారి 1974‌కు చెందిన విస్కీ బాటిల్ తీసుకొచ్చి, తన కొడుకు తలపై కాస్త పోశాడు. సరిగ్గా అదే సమయంలో.. పీట్‌కు ఓ అద్భుతమై ఆలోచన తట్టింది. తన కుమారునికి 18 సంవత్సరాల వయసొచ్చే వరకు ప్రతి ఏటా ఓ విస్కీ బాటిల్‌‌ను బహుమతిగా ఇస్తూ.. 18వ పుట్టినరోజున 18 సంవత్సరాల ఓల్డ్ విస్కీ బాటిల్‌ను కానుకగా ఇస్తే బాగుంటుందని అనుకున్నాడు.

అలా మొదలైన ‘బర్త్ డే గిఫ్ట్’.. రాబ్సన్‌కు 28 ఏళ్లు వచ్చే వరకు కొనసాగింది. పీట్ వీటి కోసం ఇప్పటివరకు దాదాపుగా రూ.5 లక్షలు వెచ్చించాడు. వాటి విలువ ఇప్పుడు అక్షరాల రూ.40 లక్షల పైమాటే. మార్క్ లిట్లర్ అనే విస్కీ బ్రోకర్ ద్వారా ఆ 28 బాటిళ్లను అమ్మేసిన రాబ్సన్.. వాళ్ల నాన్న కోసం ఓ మంచి ఇల్లు కొనడం విశేషం.

అయితే, ప్రతి ఏటా తన తండ్రి ఇచ్చే అపురూప కానుకను రాబ్సన్ ఎప్పుడైనా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ‘వీటిని నేను చెప్పేంత వరకు ఓపెన్ చేయొద్దని’ పీట్ తన కొడుకుకు కండిషన్ పెట్టాడు. రాబ్సన్ కూడా తండ్రి చెప్పినట్టుగా ఆ బాటిల్స్ ఓపెన్ చేయలేదు. ‘నాన్న ఇచ్చే బహుమతి చాలా బాగుండేది. నేను చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు.. వాటిని తాగాలనిపించేది. కానీ ఆయన మాట గుర్తుకొచ్చి ఆగిపోయేవాణ్ణి. నాకు నేనుగా.. ఓపెన్ చేయకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డాను. కానీ చివరకు విజయం సాధించాను’ అని రాబ్సన్ వివరించాడు. కాగా, ఈ తండ్రీకొడుకులు చేసిన చిన్న పొదుపు.. ఇప్పుడు ఇల్లు రూపంలో ఓ పెద్ద బహుమతిని అందించింది.

ఈ రియల్ ఇన్సిడెంట్ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు చేయకుండా.. పొదుపు చేస్తే, ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. కరోనా పాండమిక్ కారణంగా పెద్ద పెద్ద వ్యాపారుల నుంచి బడా బడా సెలెబ్రిటీల వరకు అందరూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నవారే. అయితే, వారికి డబ్బులు ఎలాగొలా అడ్జస్ట్ అవుతాయి. కానీ మిడిల్ క్లాస్ బతుకుల్లో.. రూపాయి రూపాయికి చేయి చాపాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందువల్లే.. పొదుపు చేయడం నేర్చుకోవాలి.


Next Story

Most Viewed