సైబర్ నేరగాడు.. గ్రామంలో పాగా.. లక్షలు దోచేసి పరార్

by  |
సైబర్ నేరగాడు.. గ్రామంలో పాగా.. లక్షలు దోచేసి పరార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మోసాలకు పేరుగాంచిన సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. సిటీ ప్రజలను వివిధ రకాల స్కీమ్‌లు, ఆఫర్లు అని చెప్పి స్కామ్ చేసేవాళ్లు రూట్ మారుస్తున్నారు. ఏకంగా బ్యాంక్‌ల నుంచి ఖాతాదారులకు తెలియకుండానే డబ్బులు దోచేస్తున్నారు. ఇటీవల ఏపీ గుంటూరులో జరిగిన ఘటన మరవక ముందే తాజాగా తెలంగాణలో కూడా వెలుగు చూసింది. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామస్తుల వెలిముద్రలు తీసుకొని డబ్బులు దోచుకున్న వ్యవహారం కలకలం రేపింది.

గౌరాయపల్లి గ్రామానికి చెందిన దూశెట్టి భాస్కర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. గ్రామంలోని అమాయక ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి.. నగదు విత్ డ్రా చేసుకున్నాడు. ఓ మహిళకు పింఛన్ ఇప్పిసానని చెప్పి ఆమె వెలిముద్రలు నాలుగు సార్లు తీసుకున్నాడు. అయితే, మూడు రోజుల తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఓరుగంటి చెండమ్మ షాక్ అయింది. అకౌంట్లో నుంచి రూ. 57 వేలు డ్రా కావడంతో వాపోయింది.

మరో మహిళకు కూడా రీచార్జీ చేయిస్తానని చెప్పి రూ. 10 వేలు, మరో వ్యక్తికి పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని రూ. 67 వేలు డ్రా చేసుకున్నాడు. అంతేకాకుండా మరో ఐదుగురి నుంచి రూ. 4 లక్షల వరకు కాజేశాడు. అతడిని నమ్మి మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే మరో మహిళ కూడా ఇదే వ్యవహారంలో కంప్లైట్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, ఈ వ్యవహారాలను పసిగట్టిన దూశేట్టి భాస్కర్ పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చివరకు అమాయక గ్రామ ప్రజలను కూడా టార్గెట్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.


Next Story