తహసీల్దార్ నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదు

by  |
తహసీల్దార్ నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మేడ్చల్ జిల్లా కీసర భూ వివాదంలో రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కీసర మండలం రాంపల్లిలోని భూముల వ్యవహారంలో ఉద్దేశ్యపూర్వకంగానే కందాడి ధర్మారెడ్డి, అతని బంధువులకు తహసీల్దార్ నాగరాజు కొత్త పాస్‌బుక్ లను జారీ చేసేందుకు జూలై 9వ తేదీన తన డిజిటల్ సంతకంతో కీసర ఆర్డీవోకు అప్రూవల్ కోసం పంపాడు.

రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 621/ఎల్‌యూ/1 లో కందాడి లక్ష్మమ్మకు 24.16 గుంటలతో పాటు పద్నాలుగున్నర గుంటలు, సర్వే నెంబరు 623/ఏ/ఏఏలో 33గుంటలు కందాడి బుచ్చిరెడ్డికి , సర్వే నెంబరు 625/ఇ 19 గుంటలు కందాడి మణెమ్మకు, సర్వే నెంబరు 633/ఏ/20 లో 1 ఎకరం 2 గుంటలను కందాడి ధర్మారెడ్డి పేర్లపై పాస్‌బుక్ జారీ చేసేందుకు ఆర్డీవోకు పంపారు. ఈ పాస్‌బుక్‌లు ఆర్డీవో వద్ద పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.68 కోట్లు ఉండగా, బహిరంగ మార్కెట్ ప్రకారం దాదాపు రూ.48.80 కోట్లు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. తహసీల్దార్ నాగరాజు ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమంగా కందాడి ధర్మారెడ్డికి, అతని కుటుంబ సభ్యులకు పాస్ బుక్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినట్టుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలడంతో ఏసీబీ అధికారులు క్రిమినల్ కేసును నమోదు చేశారు.


Next Story

Most Viewed