వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. తండ్రి చేసిన పనికి అంతా షాక్..!

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-24 07:34:50.0  )
వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. తండ్రి చేసిన పనికి అంతా షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్/మహబూబ్ నగర్ బ్యూరో: ‘నా కూతురు ఆత్మహత్యకు కారకులైన వారి ఆచూకీ మీకు తెలిస్తే నాకు వెంటనే తెలియజేయండి’ అంటూ ఓ తండ్రి తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా మండలం గుడబలూరు గ్రామానికి చెందిన చెన్నప్ప గౌడ, శరణమ్మ దంపతుల ఏకైక కూతురు విజయలక్ష్మిని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న శంకర్ రెడ్డికి మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డికి భారీ మొత్తంలో బంగారం, నగదు, ఇతర సామాగ్రిని కట్నంగా ముట్ట చెప్పారు. భర్త శంకర్ రెడ్డితో పాటు, అత్త సావిత్రమ్మ, ఆడపడుచులు పుష్ప, డాక్టర్ లక్ష్మి తదితరుల వేధింపుల వల్లే తమ కూతురు మరణించింది అని విజయలక్ష్మి తండ్రి చెన్నప్ప గౌడ ‘దిశ’కు తెలిపారు.

కూతురు మరణించినప్పుడు మేము ఇచ్చిన కట్నం కానుకలు తిరిగి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు. కానీ వాటిని ఇప్పటివరకు ఇవ్వలేదు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి కేసు నమోదు కాకుండా చేశారు.. మా మండలమైన కృష్ణాలో ఫిర్యాదు చేయడానికి వెళితే సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది మాకు సంబంధం లేదు అని చెబుతున్నారు. శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలవడానికి వెళితే వారి ఆచూకీ లేదు. అందుకే వెయ్యికి పైగా ఫ్లెక్సీలు ముద్రించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ రహదారులు, ముఖ్య పట్టణాల కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందని చిన్నప్ప గౌడ తెలిపారు. ఈ ఫ్లెక్సీలో ఏర్పాటు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తూ.. చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed