కరోనా నుంచి పోలీసులను రక్షించేందుకే ఇలా చేస్తున్నాం: వరంగల్ సీపీ

by  |
కరోనా నుంచి పోలీసులను రక్షించేందుకే ఇలా చేస్తున్నాం: వరంగల్ సీపీ
X

దిశ, వరంగల్: స్వీయ రక్షణతో కరోనా కట్టడి సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏ ఒక్కరూ కరోనా భాధితుడు కావద్దనే లక్ష్యంగా ముమ్మరంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో భాగంగా పోలీస్ అధికారులకు థర్మల్ స్క్రీనింగ్, బీపీ మానిటరింగ్, ఆక్సిజన్ సాట్యూరేషన్ మొదలైన పరీక్షలు నిర్వహించి రోగనిరోధక శక్తి పెంపునకు అవసరమైన మెడిసిన్ ను డాక్టర్లు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో సైతం కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ ను సందర్శించే ప్రజలు, సిబ్బంది శానిటైజర్ తో ముందుగా చేతులు పరిశుభ్రపర్చుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. అలాగే పోలీస్ అధికారులు డ్యూటీ సమయాల్లో మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వహించేలా సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ ఇన్ చార్జ్ డీసీపీ మల్లారెడ్డి, అదనపు డీసీపీ భీంరావు, గిరిరాజు, ఏసీపీ ప్రతాప్ కుమార్, పోలీస్ సంక్షేమాధికారి ఆర్.ఐ భాస్కర్, ఇన్స్పెక్టర్లు మల్లయ్య, కిషోర్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్, యూనిట్ డాక్టర్ విజయ్ కుమార్ తోపాటు జిల్లా మెడికల్ వైద్య బృందం, డాక్టర్ సునిల్ దత్ సుధ, డాక్టర్ అరుణ్ చంద్ర, డాక్టర్ ప్రతాప్ తో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Next Story