‘మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే సగం జీతం కోత తప్పదు’

by  |
‘మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే సగం జీతం కోత తప్పదు’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఇప్పటివరకూ ఎలాంటి వేతనాల కోత విధించలేదని, ఒకవేళ కరోనా వ్యాప్తి పెరిగి మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే కనీసం 50 శాతం వేతనాల కోత తప్పదని దేశీయ దిగ్గజ ఆటో కంపెనీ బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి కర్మాగారాల్లో ఉద్యోగులు కరోనా సోకి, మరణిస్తున్నారనేది అవాస్తవమని రాజీవ్ అన్నారు. కొవిడ్-19 సోకినవారు పని చేయడానికి రావట్లేదని, చాలావరకూ అందరూ కంటైన్‌మెంట్ జోన్‌లలో ఉన్నారని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఇదివరకే కంటైన్‌మెంట్ జోన్‌లలో ఉన్న పరిశ్రమలను మూసేశామని, కరోనా సోకిన ఉద్యోగులు రాక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.

దేశంలోనే అధిక కేసులు నమోదవుతున్న మహరాష్ట్రలో బజాజ్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఔరంగాబాద్‌లో ముంబై మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్న వాలుజ్ ప్లాంట్‌లోనూ కొందరు కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు ఐదుగురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. “కొందరు ఉద్యోగులు పనికి రావటానికి భయపడుతున్నారు. మరికొందరు వస్తున్నప్పటికీ సెలవు తీసుకుంటున్నారు” అని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఉద్యోగికి సన్నిహితంగా మెలిగే నలుగురు ఉద్యోగులను హోం క్వరంటైన్‌కు పంపిస్తున్నామని బాజీరావ్ పేర్కొన్నారు. కాగా, దేశీయ అతిపెద్ద మోటార్ బైక్ ఎగుమతిదారైన బజాజ్ కంపెనీ ఏడాదికి సుమారు 33 లక్షల ద్విచక్ర, ఇతర వాహనాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, వాలుజ్ ప్లాంట్‌లోనే 50 శాతం ఉత్పత్తి జరుగుతుంది.


Next Story

Most Viewed