కార్పొరేట్ వైద్యం వెరీ కాస్ట్లీ

by  |
కార్పొరేట్ వైద్యం వెరీ కాస్ట్లీ
X

కరోనా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు కాసులు కురిపిస్తోంది. అవి వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్నాయి. మందులే లేని కరోనా చికిత్సకు లక్షల రూపాయల్లో బిల్లులు వేస్తున్నాయి. పేషెంట్ల అత్యవసర పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తోక్కుతున్నాయి. మృతదేమాలతోనూ బేరమాడుతున్నాయి. ప్రజల్లో కరోనా పట్ల ఉన్న భయమే వీటికి సువర్ణావకాశంగా మారుతోంది.

దిశ, న్యూస్ బ్యూరో:
కష్టకాలంలో ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమకున్న దాంట్లో కొద్దోగొప్పో బాధితులకు సాయం చేస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం నైతికత, విలువలను పాతరేసి అందినకాడికి దోచుకుంటున్నాయి. లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా పాజిటివ్ బాధితులకు ఆర్థిక స్థోమతను బట్టి బెడ్‌లు కేటాయిస్తున్నాయి. వార్డుల్లో బెడ్‌లు ఖాళీ లేవంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. డబ్బులు కట్టకుంటే డెడ్‌బాడీలను సైతం బయటకు పంపడం లేదు. ఏ వార్డులో ఏ చికిత్సకు ఎంత ఖర్చు చేయాలో ప్రభుత్వం ధరలను నిర్ణయించినా ఈ ఆస్పత్రులు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసే దగ్గర పూల్ టెస్టులు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాయి. ప్రభుత్వం మాత్రం హెచ్చరికలు, నోటీసులతోనే సరి పెట్టుకుంటోంది. ప్రేక్షకపాత్ర వహిస్తోంది. కళ్లెదుట లోపాలు జరుగుతున్నా చర్యలు తీసుకోడానికి వెనకాడుతోంది. కారణం ఆసుపత్రుల యాజమాన్యానికి రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి ఉండడమే. కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇబ్బందులు వస్తే ఫిర్యాదు చేయడంటూ ఒక వాట్సాప్ నెంబర్‌ను ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఆరోగ్యశ్రీకి తోడుగా
ఆరోగ్యశ్రీ పథకంతో లక్షలు, రూ.కోట్లల్లో లాభాలు దండుకున్న ఈ ఆస్పత్రులు ఇప్పుడు కరోనాను కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీతో లబ్ధిపొందామన్న కృతజ్ఞత కూడా లేదు. ప్రపంచాన్నే కుదిపేస్తున్న కరోనా వైరస్ ఒక విపత్తు అని దేశాలన్నీ గగ్గోలు పెడుతూ ఉంటే కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం ఈ విపత్కర సమయాన్నే క్యాష్ చేసుకుంటున్నాయి. పైరవీలు, ఆర్థిక స్థోమత లేదా పలుకుబడి ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు స్వచ్ఛందంగా ఉచితంగా, తక్కువ ధరకు చికిత్స చేయడానికి ముందుకొస్తే ఇక్కడ ఎంత ఎక్కువ దోచుకుందామా అనే తీరులో వ్యవహరిస్తున్నాయి.

సర్కారుపై భరోసా కరువు
ఆర్థికంగా స్థితిమంతులు కార్పొరేట్ వైద్యానికి మొగ్గుచూపుతారు పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు సర్కారు ఆసుపత్రులే దిక్కు. రాష్ట్రంలో సర్కారు ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం ఎలాంటిదో తెలియంది కాదు. నల్లగొండలో ఆక్సిజన్ అందక కన్నతల్లి చేతుల్లోనే కొడుకు కన్నుమూస్తాడు. ఆక్సిజన్ అందక వెంటిలేటర్ కోసం మొరపెట్టుకున్నా దొరకక చెస్ట్ ఆస్పత్రిలో ఒకరు నిమిషాల్లోనే చనిపోతారు. సరైన చికిత్స అందడం లేదని తెలిసి ఆఖరి ప్రయత్నంగా ఏ మంత్రికో సెల్ఫీ వీడియో ద్వారా మొరపెట్టుకుంటే, పైరవీలతో మరో ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయక తప్పడంలేదు. టెస్టులు చేయించుకోడానికి సైతం పైరవీలు తప్పడంలేదు.

సర్కారు గొప్పలు
‘’లక్ష మంది పేషెంట్లు వచ్చినా చికిత్స అందించడానికి సిద్ధం’’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా సర్కారు ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కుదరడంలేదు. ‘’వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సర్కారు వెనకాడదు’’ అని గంభీర ప్రకటనలు చేస్తోంది. జీతాలు పెంచాలంటూ నర్సులు నాలుగైదు రోజులు ధర్నా చేయాల్సి వస్తోంది. జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కాల్సి వస్తోంది. వెంటిలేటర్లు ఉన్నా వాటికి నోచుకోక, ఆక్సిజన్ పుష్కలంగా ఉందని ప్రభుత్వం చెబుతున్నా అది దొరకక పేషెంట్ల పోతున్న ప్రాణాలు సామాన్యుల్లో సర్కారు ఆసుపత్రులంటే దడ పుట్టిస్తు న్నాయి. ‘’ఆసుపత్రుల్లో వైఫై ఇచ్చింది ఇలాంటి లోపాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోడానికా… ఒకరిద్దరు చనిపోతే ఇంత రాద్ధాంతం చేస్తారా.. మొత్తం పాజిటివ్ పేషెంట్లలో రెండు శాతం కూడా చనిపోలేదుగదా..’’ మంత్రుల నోటి నుంచి ఇలాంటి కామెంట్లు రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.


Next Story

Most Viewed