వారియర్లకు కొత్త ముప్పు

by  |
వారియర్లకు కొత్త ముప్పు
X

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా కారణంగా ప్రపంచ మానవాళి అంతా అల్లకల్లోలం అవుతోంది. మన దేశంలోనూ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు నిత్యం కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారు పని ఒత్తిడికి గురి కావడం సహజమే. ఇదే అదనుగా వైద్య సిబ్బందిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో బ్యాంకు వివరాలంటూ ఫోన్లు చేస్తూ.. లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు.

పేటీఎం అప్డేట్ పేరుతో మోసాలు

కాంటినెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు ఈ నెల 9న పేటీఎం వాలెట్ ధృవీకరణ పెండింగ్‌లో ఉందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మొబైల్‌లో టీమ్ వ్యూయర్ లేదా క్విక్ సపోర్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కోరారు. ఆమె డ్యూటీలో ఆత్రుతలో ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఐడీ నంబర్‌ను చెప్పింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి చెప్పినట్టుగా పేటీఎం నుంచి ఆమె కొంత మొత్తాన్ని లావాదేవీలు చేసింది. దీంతో ఖాతా వివరాలను పొందిన సదరు అపరిచిత వ్యక్తి ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి రూ.1.49 లక్షలు, ఆమె యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.19,999 /లు విత్ డ్రా అయ్యాయి. ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు మోసగాడితో పేటీఎం కేవైసీ అప్‌డేట్ వివరాలను షేర్ చేసినందుకు మొత్తం రూ.1.69 లక్షలను కోల్పోవాల్సి వచ్చింది. మరో కేసులో.. ఈ నెల 18న ఒక వైద్యుడికి పేటీఎం ఎగ్జిక్యూటివ్ గా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. పేటీఎమ్ అప్డేట్ పేరుతో బ్యాంక్ వివరాలను చెప్పాలని కోరాడు. కొవిడ్-19 రోగులకు వైద్యం చేయడంలో బిజీగా ఉండడంతో అసంకల్పితంగా తన బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకున్నాడు. ఫలితంగా సదరు వైద్యుడు రూ.91 వేలను కోల్పోయాడు. కొవిడ్ రోగులకు వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

బ్యాంక్ ఖాతాలకు సెపరేట్ ఫోన్ వాడాలి: వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ

ఈ తరహా మోసాలను జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా జిల్లాకు చెందిన సైబర్ మోసగాళ్లు అధికంగా చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసిబ్బంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు బిజీగా ఉండే వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ మొబైల్‌లో టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్, ఎనీ డెస్క్, ఇంక్‌వైర్ తదితర యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు. ఇవన్నీ రిమోట్ యాక్సెస్ యాప్‌లు. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే మీ మొబైల్‌ను మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు కంట్రోల్ చేస్తారు. బ్యాంకింగ్ ప్రయోజనాలకు ప్రత్యేక ఫోన్‌ను ఉపయోగించండి. ఏ బ్యాంక్ నుంచి కూడా ఎవరూ మీ బ్యాంక్ ఓటీపీ, సీవీవీ నెంబర్ చెప్పాలని అడగరు. కేవైసీ వివరాలను అడిగే కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లను నమ్మవద్దు. తెలియని వ్యక్తులు రిమోట్ యాక్సెస్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే.. చేయకూడదు. పేటీఎం తన కస్టమర్లలో ఎవరినీ కూడా కేవైసీ కోసం ఎస్ఎంఎస్ పంపదు.


Next Story

Most Viewed