ఠాణాల ఎదుట బ్యానర్లు.. ఏమనంటే..?

by  |
ఠాణాల ఎదుట బ్యానర్లు.. ఏమనంటే..?
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు పోలీసులకు కరోనా ఫీవర్ పట్టుకుంది. కరోనా కట్డడికి విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ప్రస్తుతం వైరస్ మాటెత్తితేనే బెంబేలెత్తుతున్నారు. ఇటీవల పలువురు పోలీసులకు కరోనా సోకడంతో మిగతా పోలీసులు ఠాణాకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కరోనా కట్టడిలో రోడ్లపైనే గడిపిన వాళ్లు.. కొద్దిరోజులుగా పోలీస్ స్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కేసులు పేరుకుపోవడమే కాకుండా లాక్‌డౌన్ ఎత్తేయడంతో కొత్త కేసులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదు దారులు సమస్యల పరిష్కారానికి పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలనే నిబంధన మేరకు కేవలం ఒక్కో ఫిర్యాదు దారుడిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ మేరకు వరంగల్ నగరంలోని పలు ఠాణాల్లో బ్యానర్లు కూడా వెలిశాయి.

ఖాకీలకు పాజిటివ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా విస్తరిస్తోంది. కొద్దిరోజుల కిందట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో అక్కడి జనం మరింత ఆందోళనకు గురయ్యారు. దీనికి తోడు ఇటీవల డాక్టర్లు, నర్సులకు సైతం కరోనా అంటుకుంది. కొంతమంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా పది మందికి పైగా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు పోలీస్ శాఖను కూడా వణికిస్తోంది. ఇటీవల పరకాలకు చెందిన ఓ పోలీస్ అధికారితో పాటు కానిస్టేబుల్‌కు సైతం కరోనా సోకింది. ములుగు జిల్లా వాజేడు కు చెందిన ఓ కానిస్టేబుల్ కు పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజుల కిందట వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రైటర్‌కు కరోనా సోకింది. దీంతో ఎస్సైతో పాటు గన్ మెన్, డ్రైవర్ ను హోం క్వారంటైన్ లో ఉంచారు. కాగా హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు పోలీస్ అధికారులకు పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా అదే ఠాణాలోని మరో సర్కిల్ ఇన్ స్పెక్టర్‌కు సైతం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌లోకి ఫిర్యాదు దారులు ఒక్కొక్కరు మాత్రమే రావాలని ప్రధాన గేట్‌ వద్ద, వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో సైతం బ్యానర్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందనే విమర్శలు లేకపోలేదు. జనం ఇబ్బడిముబ్బడిగా రోడ్లపైకి వస్తుండటంతో అంతే స్థాయిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రజలను కట్టడి చేయడం కోసం పోలీసులు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసులకు కూడా కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed