పండ్ల ధరలకు రెక్కలొచ్చినయ్..

by  |
పండ్ల ధరలకు రెక్కలొచ్చినయ్..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు జనంపై ముప్పెట దాడి చేస్తున్నాయి. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే రోగాలను జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తుండటంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతం పెంచేశారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలతో ప్రస్తుత రేట్లను పోలిస్తే భారీ వ్యత్యాసం ఉన్నట్లు కొనుగోలుదారులు వాపోతున్నారు. ధరలు అధికంగా ఉన్నా, ఆరోగ్యం కోసం తప్పని సరిగా కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

ధరలు పైపైకి..

దానిమ్మ, బత్తాయి, నిమ్మకాయలు, రేగుపళ్లు, బొప్పాయి, తెల్లద్రాక్ష, దానిమ్మ, యాపిల్, పైనాపిల్, అరటి తదితర పండ్లను గతంలో కంటే ఇప్పుడు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఉదాహరణకు దానిమ్మ గతంలో రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.120 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్ల రేట్లను పెంచేశారు. హోల్ సేల్ మార్కెట్లలో మాత్రం పండ్ల ధరలు తక్కువకే దోరుకుతున్నట్లు తెలుస్తోంది. ధరల నియంత్రణపై అధికారుల నిఘా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లను పెంచి విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏ పండ్ల దుకాణం వద్ద కూడా ధరల పట్టిక ఉండదు. అలాగే తూకంలోనే మోసాలకు పాల్పడుతున్నారని, 100 నుంచి 200 గ్రామాలు తక్కువగా వస్తున్నట్లు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగర మార్కెట్ల లో ధరలు ఇలా..

పండ్లు గతంలో (కిలో) తాజాగా
తెల్ల ద్రాక్ష రూ.80 రూ.120
నల్ల ద్రాక్ష రూ.100 రూ.140
దానిమ్మ రూ.70 రూ.110
యాపిల్ (సిమ్లా) రూ.160 రూ.220
యాపిల్(న్యూజిలాండ్) రూ.190 రూ.260
జామకాయలు రూ.40 రూ.60
బత్తాయి రూ.60 రూ.110
అరటి పండ్లు (డజన్) రూ.50 రూ.60
బొప్పాయి రూ.30 రూ.50

Next Story