రాష్ట్రంలో రికవరీ రేటు తగ్గుతోంది

by  |
రాష్ట్రంలో రికవరీ రేటు తగ్గుతోంది
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో రికార్డు స్థాయిలో 2,207 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్ నగరంలో 532 కేసులు నమోదుకాగా మిగిలిన 1,675 కేసులు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఒకే రోజున 13 మంది మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 600 దాటింది.

ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోందని, దాదాపు 75%గా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినా.. గత మూడు రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో రికవరీ రేటు 70%కి తగ్గిపోయింది.

ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 21,417 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఉంటే, అందులో 14,837 మంది హోమ్ ఐసొలేషన్‌లోనే ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు ఆరున్నర వేల మంది పేషెంట్లలో దాదాపు నాలుగున్నర వేల మందికంటే ఎక్కువ మందికి ఆక్సిజన్, వెంటిలేషన్ సౌకర్యం అవసరమవుతోంది. సాధారణ పేషెంట్ల కంటే సీరియస్ కండిషన్ ఉన్నవారే ఎక్కువ మందిగా ఉన్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 196, మేడ్చల్ జిల్లాలో 136, వరంగల్ అర్బన్ జిల్లాలో 142, కామారెడ్డి జిల్లాలో 96, కరీంనగర్ జిల్లాలో 93, నిజామాబాద్ జిల్లాలో 89,గద్వాల జిల్లాలో 87, ఖమ్మం జిల్లాలో 85, పెద్దపల్లి జిల్లాలో 71, జనగాం జిల్లాలో 60 చొప్పున మొత్తం 32 జిల్లాల్లో 1,675 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా బారిన పడకుండా మిగిలిన జిల్లా ఒక్కటి కూడా లేదు.

కరోనా పాజిటివ్ బారిన పడిన పేషెంట్లను వయసువారీగా పరిశీలిస్తే, 31-40 ఏళ్ల వయసు మధ్యవారిలోనే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. యుక్త వయసులో ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగానే ఉన్నందున సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళడం లేదు.



Next Story

Most Viewed