కరోనా నయమైనా.. దగ్గరకు రానివ్వట్లే!

by  |
కరోనా నయమైనా.. దగ్గరకు రానివ్వట్లే!
X

దిశప్రతినిధి, మెదక్ :

మనం పోరాడాల్సంది వ్యాధితో.. రోగితో కాదు.. అని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా పలువురిలో మార్పు రావడం లేదు. కరోనా బారిన పడిన వారు పూర్తిగా కోలుకోని ఇంటికి వచ్చినా కొందరు వారిని దూరంగానే ఉంచుతున్నారు. అంటరాని వారిగా చూస్తున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. అక్కడక్కడ మినహా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ప్రజల తీరులో మార్పు రావడం లేదు. సిద్దిపేటకు చెందిన కొవిడ్ బాధితుడు ‘దిశ’ ప్రతినిధితో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

కరోనా బాధితులు కొన్ని రోజులు వైరస్ తో పోరాటం చేసి కోలుకున్నారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకా చుట్టు పక్కల వారు అనుసరిస్తున్న తీరును వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. కరోనా సోకిందంటే చాలు .. వారిని శత్రువులా చూస్తున్నారు. దీనితో బాధితుల్లోని మనో నిబ్బరం దెబ్బతింటోంది. నిన్న.. మొన్నటి వరకు కలిసి మెలిసి తిరిగిన వారే.. ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. సాటి మనుషులను చిన్న చూపుతో చూడటం సరైన పద్దతి కాదని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. అధికారులు సైతం అక్కడక్కడ మినహా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కరోనా నుంచి కోలుకున్న వారికి మానసిక వేదన తప్పడం లేదు. సిద్దిపేటకు చెందిన కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తి దిశ ప్రతినిధితో తన ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా బారి నుంచి కోలుకున్నా మానసిక వేదన తప్పడం లేదంటూ వాపోయాడు. తమకు కరోనా వైరస్ భయం కంటే.. మానసిక వేదన ఎక్కువైందని, ఇతరుల వివక్ష చూపుతుండటంతో తాము కుంగిపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యాడు. నిన్న మొన్నటి వరకు కలిసి మెలిసి తిరిగిన వారు సైతం తమకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే ముఖ్యం చాటేస్తున్నారని, చికిత్స పొంది సురక్షితంగా ఇంటికి చేరినా చూట్టుపక్కల వారు చిన్న చూపు చూస్తున్నారని తమ పట్ల చుట్టుపక్కల వారు సైతం చిన్న చూపు చూస్తుండం తమకు ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తొలగని అపోహలు..

కొవిడ్ వ్యాధి బారిన పడి కోలుకున్న వారతో కలిసి జీవించేందుకు కొందరు ఇష్టపటం లేదు. వారిలో నెలకొన్న అపోహలు తొలగిపోవడం లేదు. ప్రజల్లో నెలకొన్న అపోహలతో కరోనా మహమ్మారి కంటే ఇప్పుడు వివక్షే పెద్ద రోగంగా కనిపిస్తోంది. హోం ఐసొలేషన్, ప్రభుత్వ కొవిడ్-19 ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొంది సురక్షితంగా ఇంటికి చేరినా.. బాధితుల పట్ల కొందరు వివక్ష చూపుతున్నారు. మానవతా ధృక్పదంతో చూడాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తిస్తుండడం బాధ కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. ప్రజల తీరు మారటం లేదు. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో బాధితుల్లో మానసిక ధైర్యం దెబ్బతింటోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, అధికారులు సమర్ధవంతంగా సేవలు అందిస్తున్నారు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. వైరస్ సోకిన వారితో మాట్లాడి మానసిక ధైర్యం నింపుతున్నారు. సరైన అవగాహన లేక చాలా చోట్ల బాధితులు వివక్షకు గురవుతున్నారు.

ప్రజల్లో భయం..

ప్రస్తుతం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుండగా.. ప్రతి ఒక్కరినీ ఏదో తెలియని భయం వెంటాడుతున్నది. ఈ కారణంగానే బాధితుల‌పై అనేక రూపాల్లో వివక్ష చూపుతున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులతో సన్నిహితంగా ఉంటే వైరస్ తమకూ సోకుతుందనే భయం ప్రజలను వెంటాడుతోంది. కానీ, వైరస్ ఇప్పట్లో పోయేది కాదు. పాజిటివ్ కేసుల సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే ప్రమాదముంది. కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేదు. లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్లో చికిత్స పొందవచ్చు. ఇప్పుడు వస్తున్న పాజిటివ్ కేసుల్లో 50 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో హోం ఐసొలేషనే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సూచనలతో చాలా మంది పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోవడంతో ఇండ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. వారం, పది రోజుల్లోనే బాధితులు కరోనా నుంచి కోలుకుంటున్నా..14 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాత మనలో ఒకరిగా కలిసి పోతున్నారు. ఇదే మిగతా జనంలో భయానికి కారణమవుతోంది. బాధితులకు దూరంగా ఉండాలని జరుగుతున్న ప్రచారం క్రమంగా వివక్షకు దారితీస్తోంది. రోగుల‌పై కనికరం చూపాల్సిన సమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారి మానసిక ధైర్యం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 3వేలకు పైగా కేసులు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు సగం మంది వరకు కోలుకున్నారు. వీరిలో చాలా మంది ఇరుగుపొరుగు వారి ప్రవర్తనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, జిల్లా యంత్రాంగం పెద్దఎత్తన అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో భయాందోళనలు దూరం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఓ బాధితుడి ఆవేదన..

నేను కరోనా బారిన పడి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. కానీ చుట్టుపక్కల వాళ్లు నన్ను అంటరాని వాడిగా చూస్తున్నారు. గతంలో లాగా ఎవరూ నాతో సరిగ్గా కలిసి మాట్లాడటం లేదు. కరోనా రోగం కంటే వీరి ప్రవర్తనే నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలి.



Next Story

Most Viewed