నయా ట్రెండ్​

by  |
నయా ట్రెండ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: లైఫ్​ స్టైల్​ మారింది.. టెక్నాలజీ ప్రపంచాన్నే స్మాల్​ విలేజ్​గా చేసింది.. సమయాన్ని పెట్టుబడిగా లాభాన్ని రాబట్టుకునే రోజులొచ్చాయి.. ప్రతి పనిని స్మార్ట్​గా చేస్తూ పైకం సంపాదించే ధోరణి నడుస్తోంది.. ఈ క్రమంలోనే కరోనా వచ్చి మనిషి పొజీషన్​ను, లిమిట్స్​ను మరో మారు గుర్తు చేసింది… ప్రతీ సందర్భంలో జాగ్రత్తలు పెరిగాయి.. బిజినెస్​ను డోర్​ స్టెప్​ వద్దకే తీసుకెళ్లే ట్రెండ్​వచ్చింది.. ఈ క్రమంలోనే కరోనా జాగ్రత్తల్లో భాగంగా షాపింగ్​ మాల్స్​కొత్త మార్గాల్ని ఆలోచించాయి.. టెక్నాలజీని ఉపయోగించుకుని దసరా, దీపావళి కి కస్టమర్ల పనిని ఈజీ చేసేందుకు ప్లాన్స్​ చేస్తున్నాయి.

మనం సినిమాకు వెళ్లాలంటే ఏం చేస్తాం? వెబ్‌సైట్‌లోనో, మొబైల్ యాప్‌లోనో ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ మెగా మాల్స్‌లో షాపింగ్‌కు అలాంటి విధానమేదీ లేదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో షాపింగ్‌కు వెళ్తే రద్దీ కారణంగా వైరస్ సోకుతుందేమోననే భయం వెంటాడుతోంది. అన్‌లాక్ వచ్చినా వ్యాపారం తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చాలా వస్త్ర దుకాణాలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైమ్‌కు వెళ్తే రద్దీ బాధ లేకుండా, వైరస్ భయం లేకుండా బయటపడవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునేటప్పుడే మనకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్‌కు వెళ్లనున్నామో ఎంపిక చేసుకోవాలి. ఎన్ని గంటలకు వెళ్తాం, ఎంత మంది లాంటి వివరాలన్నీ చెప్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఆ సమయానికి వెళ్తే షాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని రావచ్చు.201

నగరంలో దాదాపు పదిహేను వస్త్ర దుకాణాలు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. కరోనా వచ్చిన తర్వాత వస్త్ర దుకాణాలు రెండు నెలల పాటు మూతపడడంతో ఆదాయమే లేకుండా పోయింది. అన్‌లాక్‌తో తెరుచుకునే అవకాశం వచ్చినా సగటున 40 శాతం మించి వ్యాపారం జరగడం లేదు. అద్దె, కరెంటు బిల్లు, ఉద్యోగుల జీతాలు, నెలవారీ నిర్వహణ తదితరాలకు సరిపోయేంత ఆదాయం కూడా రావడంలేదని వాపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న దుకాణాలు ఇప్పుడు దసరా, దీపావళి పండుగలకైనా వ్యాపారం పాత పరిస్థితికి చేరుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాయి.

ఆంక్షలు సడలించినా కస్టమర్లు ఎందుకు రావడంలేదని విశ్లేషించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే విధానం బెటర్ అని భావించాయి. కస్టమర్ ఫోన్ నెంబర్ల డాటా బ్యాంకు ఆధారంగా వారికి వ్యక్తిగతంగా మెసేజ్‌లు, లింక్ పెట్టి ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చని వివరిస్తున్నాయి. ఇందుకోసం వెబ్‌సైట్‌లో కూడా తగిన ఆప్షన్‌ని పెట్టాయి. ఇప్పటికే కొన్ని వస్త్ర దుకాణాలు ఈ సదుపాయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాయి. మరికొన్ని ఆ వరుసలో ఉన్నాయి. దీనికి తోడు వైరస్ భయాన్ని పరిగణనలోకి తీసుకుని రెడీమేడ్ దుస్తుల్ని వేసుకుని చూసే ట్రయల్ విధానానికి నిర్వాహకులు స్వస్తి పలుకుతున్నారు.

వీలైనంతవరకు వినియోగదారులు తప్పనిసరి అయితేనే దుస్తుల్ని ముట్టుకోవాలన్న నిబంధనలనూ కొన్ని దుకాణాలు పెట్టాయి. కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాక ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ నగరాల్లో అమల్లోకి వచ్చాయి. నాగపూర్‌లో పేరుమోసిన షాపింగ్ మాల్ ముందుగా టైమ్ స్లాట్ రిజర్వు చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇస్తోంది. మరొకొన్ని దుకాణాలు తప్పనిసరిగా ఆరోగ్యసేతు మొబైల్ యాప్ వాడుతున్నవారికే అనుమతి కల్పిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మెగా మాల్స్ నిర్వాహకులు సభ్యులుగా ఉండే షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ముందస్తు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని స్వాగతించడం మాత్రమే కాక దీన్ని పకడ్బందీగా అమలుచేయాలని, ప్రతి వ్యక్తి చుట్టూ 75 చ.అ. దూరం వరకూ సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఒకటిన్నర లక్ష చ.అ. విస్తీర్ణం ఉండే మాల్‌లో ఈ లెక్క ప్రకారం సుమారు ఇరవై వేల మంది ఒకేసారి షాపింగ్ చేసుకునే వీలు ఉంటుందని లెక్కలతో వివరించింది. అయితే ఆయా మాల్ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ లెక్కల్లో మార్పులు ఉంటాయి.

మరికొన్ని దుకాణాలు వాట్సాప్ ద్వారా ఇంటి దగ్గరికే షాపింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాయి. నిర్వాహకులు సూచించిన నెంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలను పంపిస్తే కొనుగోలు ఐటెమ్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలు వస్తాయి. వాటిని ఎంపిక చేసుకుంటే దుకాణం నుంచే ఒక వ్యక్తి వాటిని ఇంటికి తీసుకొస్తారు. అందులోంచి మనం ఎంపిక చేసుకుని కొనుగోలుచేస్తే ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపు చేయవచ్చు. ఇంటి దగ్గరికే షాప్​ను తీసుకొచ్చే ఈ విధానం కూడా కొన్ని నగరాల్లో పాపులర్ అయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని దుకాణాలు వీటిని అమలు చేస్తున్నాయి.

కరోనా భయంతో పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ టైమ్ స్లాట్ బుకింగ్ విధానాన్ని వస్త్ర దుకాణాలే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నాయి. రిలయెన్స్ ట్రెండ్జ్, మాక్స్ ఫ్యాషన్ తదితర దుకాణాలు ఇప్పటికే వినియోగదారులకు మొబైల్ మెసేజ్‌లు పంపుతున్నాయి. త్వరలో దిల్‌సుఖ్‌నగర్, కూకట్​పల్లి, అబిడ్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ వస్త్ర దుకాణాలు కూడా వీటిని అందుబాటులోకి తేనున్నాయి.


Next Story

Most Viewed