కేసులు ఫుల్లున్నాయ్.. టెస్టుల్లేవంతే!

by  |
కేసులు ఫుల్లున్నాయ్.. టెస్టుల్లేవంతే!
X

దేశంలోని 80శాతం కరోనా కేసులు పది రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ లెక్క తేల్చింది. ఈ పది రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తే వ్యాధి మొత్తం అదుపు లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఈ పది రాష్ట్రాలలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. టెస్టులు నిర్వహించడంలో అడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. టెస్టులు తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివిటీ రేటు మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది.

దిశ, న్యూస్ బ్యూరో:

కేంద్ర బృందం మూడు రోజుల కిందట నగరంలో పర్యటించించి. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా మాత్రమే పేషెంట్లను త్వరగా గుర్తించవ్చని స్పష్టం చేసింది. ట్రేసింగ్ ద్వారా ప్రైమరీ కాంటాక్టులను కనిపెట్టవచ్చని వ్యాఖ్యానించింది. ప్రధాని మోడీ సైతం ట్రేసింగ్ లో దూకుడుగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో తొలి నుంచీ కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరమైన మేరకు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ర్యాపిడ్ టెస్టులు పెరిగాయి. బులెటిన్ లో ఇచ్చే గణాంకాలు కూడా తప్పుల తడకగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహించింది. సమగ్ర వివరాలను రోజూ వెల్లడించాలని ఆదేశించింది.

అయినా, ఇప్పటికీ ఏ జిల్లాలో ఎన్ని టెస్టులు జరిగాయి, అందులో ర్యాపిడ్ యాంటీజెన్ ఎన్ని, ఆర్‌టీ-పీసీఆర్ ఎన్ని? ప్రభుత్వ టెస్టింగ్ కేంద్రాల్లో చేసినవి ఎన్ని? ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసినవి ఎన్ని? ఇలాంటి వివరాలేవీ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొనడం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నా టక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, తెలంగాణ, గుజరాత్ లలో ఎక్కువ కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కరోనా పరీక్షలు అధికంగా చేసినట్లు తేలింది. పాజిటివిటీ రేటు మహారాష్ట్ర,లో 18.8% ఉంటే, ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 12.69శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన పాజిటివ్ కేసులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ. అక్కడ టెస్టులు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 10 నాటికి 25.92 లక్షల టెస్టులు జరిగినట్లు ఆ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో మాత్రం ఇందులో నాలుగో వంతు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 6.65 లక్షల టెస్టులు మాత్రమే చేసినట్లు బులెటిన్ పేర్కొంది.

కాంటాక్టులను గుర్తించడం లేదు..

టెస్టుల్ని వీలైనంతగా పెంచాలని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 72 గంటల వ్యవధిలో కాంటాక్టులో ఉన్న వ్యక్తుల్ని గుర్తించాలని ప్రధాని నొక్కిచెప్పారు. తెలంగాణలో టెస్టులు పరిమిత సంఖ్యలో చేసినప్పుడు ఈ విధానం అమలైంది. కరోనా లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేశారు. టెస్టుల సంఖ్యను పెంచిన తర్వాత ఈ ప్రక్రియను దాదాపుగా అటకెక్కించారు ఎవరికివారు వ్యక్తిగతంగా వచ్చి టెస్టులు చేయించుకోవడమే తప్ప కాంటాక్టులో ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసే విధానం అమలు కావడం లేదు.

దాదాపు 80 శాతం మేర పేషెంట్లలో ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు చెబున్నారు. లక్షణాలు లేకపోతే టెస్టులు చేయించుకోవద్దని సూచిస్తున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని కేంద్ర బృందానికి మంత్రి ఈటల రాజేందర్, అధికారులు చెప్పడమే తప్ప ఆచరణలో అవి సంపూర్ణంగా అమలు కావడంలేదన్నది క్షేత్రస్థాయి వివరాలను చూస్తే స్పష్టమవుతోంది.

మారని పాజిటివిటీ రేటు..

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 16 నాటికి 44,431 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అప్పటికి 5,406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 12.16%గా నమోదైంది. అప్పటి నుంచి ఆగస్టు 11 నాటికి) 6.21 లక్షల టెస్టులు చేసింది. ఈ మధ్యలో వచ్చిన పాజిటివ్ లను కలుపుకుంటే కేసుల సంఖ్య 84,544కు చేరుకుంది. పాజిటివిటీ రేటు 12.69శాతంగా ఉంది. టెస్టుల సంఖ్య పెరిగినా, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే శాతంలో దాదాపుగా మార్పు లేదు. రోజుకు సగటున 20 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది.

అందులో సగటున 1,200 చొప్పున రిపోర్టులు వెల్లడి కావడంలేదు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కారణంగా వెయ్యికి పైగా రిపోర్టులు రోజూ పెండింగ్‌లో ఉంటున్నాయి. చాలా రాష్ట్రాలు రోజుకు లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తున్నాయి. దేశం మొత్తంమీద సగటున ఏడున్నర లక్షల పరీక్షలు జరుగుతున్నాయి. టెస్టులు నిర్వహించడంలో తెలంగాణ చాలా వెనకబడి ఉంది. ప్రభుత్వం వెల్లడిస్తున్న కేసుల సంఖ్య, మృతుల సంఖ్య విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. జిల్లా వైద్యాధికారులు ఇచ్చే గణాంకాలకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేస్తున్న గణాంకాలకు పొంతన ఉండడంలేదు.


Next Story

Most Viewed