సముద్రాల్లో పేరుకుపోతున్న మాస్క్‌లు, గ్లోవ్స్

by  |
సముద్రాల్లో పేరుకుపోతున్న మాస్క్‌లు, గ్లోవ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు బాధ్యత గల పౌరులందరూ ఫేస్ మాస్క్ ధరిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌.. వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బాధితులకు ట్రీట్ చేసే సమయంలో పీపీఈ కిట్లు, గ్లోవ్స్ ధరిస్తున్నారు. కరోనా టైమ్‌లో వాటిని ధరించడం ఎంతో ముఖ్యం కూడా. కానీ మానవ తప్పిదాలు.. భూమాతకు, మూగ జీవాలకు, ప్రకృతికి, నదులు, సముద్రాలకు పెను శాపంగా మారాయి. మొన్నటి వరకు విపరీతమైన ప్లాస్టిక్ వాడకం కారణంగా సముద్ర జీవులతో పాటు, మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగేలా చేశాం. ఇప్పుడు మరో రకంగా పర్యావరణానికి ముప్పుతెస్తున్నాం. ఎలాగంటే.. ప్రస్తుతం మనం వాడే మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లు.. సముద్రాల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జలాలు కలుషితమై సముద్ర జీవులకు ప్రమాదం వాటిల్లుతోంది.

ప్రతి నెలా 12900 కోట్ల ఫేస్ మాస్కులను, 6500 కోట్ల ప్లాస్టిక్ గ్లోవ్స్‌ను వాడుతున్నామని ఇటీవలే జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ఆ విషయం ప్రచురితమైంది. వాడిపారేసిన ఈ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని పర్యావరణ పరిరక్షకులు, పర్యవేక్షకులు సముద్ర మట్టంలో కనుగొని బయటకు తీస్తున్నారు.

హాంకాంగ్‌లోని సోకో ఐలాండ్, టర్కీలోని బోస్పోరస్, కోట్ డీ అజుర్ (ఫ్రాన్స్) తదితర సముద్రాల్లో కొన్ని లక్షల మాస్క్‌లను వాళ్లు బయటకు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో మెడికల్ వేస్ట్‌ కనిపిస్తోందని, వీటిని ఇలాగే వదిలేస్తే సముద్రంలోని జీవ జాతులు ప్రమాదంలో పడొచ్చని వారు చెబుతున్నారు. మనం వాడి పారేసే ఒక్క మాస్క్ లేదా గ్లోవ్ అయినా.. భారీ తిమింగళాన్ని కూడా చంపగలదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అందుకు వాటిని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed