టీఆర్ఎస్ చెంచాలకు మేం సమాధానం చెప్పం

by  |
టీఆర్ఎస్ చెంచాలకు మేం సమాధానం చెప్పం
X

దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్, బీజేపీని వేర్వేరుగా చూడటం లేదని, కేంద్ర, రాష్ట్రాలు కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లో చెంచాలు ఎక్కువయ్యారని, వారు అడిగే ప్రశ్నలకు మేం సమాధానం చెప్పమని రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయం కూల్చివేయడానికి జీ బ్లాక్ కింద గుప్తనిధులే కారణమని, ఆపరేషన్ జీ బ్లాక్ పేరిట గుప్తనిధుల తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయ కూల్చివేతకు కోర్టుల నుంచి అనుమతి రాగానే సీఎం ఫామ్ హౌస్‌కు వెళ్లారని ఫైర్ అయ్యారు. అయితే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ళారా.. లేదంటే మరేదైనా రహస్య ప్రదేశానికి వెళ్ళారా అనేది బ్రహ్మరహాస్యంగా ఉందన్నారు. సెక్రటేరియట్ పక్కనున్న మింట్ కాంపౌండ్ 6వ నిజాంకాలంలో నాణాల ముద్రణ జరిగిందన్న ప్రచారం ఉందని, జీ బ్లాక్ నుంచి 5వ నిజాం పరిపాలన చేశారు అని ఇంగ్లీషు పత్రికలు సైతం కథనాలు రాశాయన్నారు. సెక్రటేరియట్ కింద చారిత్రాత్మక విషయాలు, ఆధారాలు ఉన్నాయని మర్రి చెన్నారెడ్డి హయాంలోనే అప్పటి కేంద్రాన్ని కోరారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వేలకోట్ల రూపాయల అక్రమాలు జరగడానికి అవకాశం ఉన్న శాఖలకు సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఇంఛార్జీలుగా నియమించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్‌రావు ఆ తర్వాత వెంటనే ఆర్కియాలజీ శాఖలో తేలారని, నీటిపారుదల శాఖలో మురళీధర్‌రావు ఎలా ఉన్నారో తెలపాలన్నారు. మూడేళ్ళ కింద అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ కమిటీ వేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్కే భవన్ ఉద్యోగులకు సైతం సెలవులు ఇచ్చి, సెక్రటేరియట్‌ను కూల్చాల్సిన అవసరం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. రహస్యాలను దాస్తున్న రఘునందన్‌రావును వెంటనే పురావస్తు శాఖ నుంచి తొలగించాలని రేవంత్ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సచివాలయం నమూనాను విడుదల చేసినప్పుడు నల్లపోచమ్మ ఆలయం, మసీద్ లేదని, నల్ల పోచమ్మ దేవాలయం కూల్చిన శాపం సీఎం కేసీఆర్ తగులుతుందని రేవంత్ అన్నారు.


Next Story