ఏవర్గానికి న్యాయం జరగట్లేదు: జగ్గారెడ్డి

by  |
ఏవర్గానికి న్యాయం జరగట్లేదు: జగ్గారెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రెండో దఫా అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ అనేక హామీలను ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలన్నింటినీ మరిచిపోయారని ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను నెట్‌లో నుండి తొలగించారన్నారు. ముస్లింల ఓట్ల కోసం 12శాతం రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ విషయాన్నే మరిచిపోయారని దుయ్యబట్టారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపించడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, జీహెచ్ఎంసీ పరిధిలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అతీగతీ లేదన్నారు.

మళ్లీ గ్రేటర్ ఎన్నికలొస్తున్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రజలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కనుమరుగైందని, 108, 104 అంబులెన్స్‌లు కనిపించడం లేదని, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలకు వీసీలే లేరన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో హామీలపై ప్రజల వద్దకు వెళ్దామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఐక్యంగా రథయాత్ర చేయాలని భట్టి, ఉత్తమ్‌ను కోరారు.


Next Story

Most Viewed