దళారుల జులుం.. కూరగాయలు నేలపాలు

by  |
దళారుల జులుం.. కూరగాయలు నేలపాలు
X

దిశ, రంగారెడ్డి: రైతులు ఆరుగాలం పండించిన పంట అమ్ముకోవడానికి మార్కెట్‌కు తీసుకొస్తే.. దళారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన కూరగాయలను అమ్ముకోవడానికి వీలు లేకుండా రోడ్డుమీద పడేస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. షాద్‌నగర్ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన వివిధ రకాల కూరగాయలను పట్టణంలోని మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కమీషన్ ఏజెంట్లు, దళారులు ఏకమై కూరగాయలను ఖరీదు చేయకుండా రైతుల వద్ద నుంచి వాటిని బలవంతంగా లాక్కుని బయటకు పారస్తున్నారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తున్న రైతులపై జులుం ప్రదర్శిస్తూ.. దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారని రైతాంగం తీవ్రంగా వాపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలు కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, ఫరూక్ నగర్, చౌదరి‌గూడెం తదితర మండలాల్లోని ఆయా గ్రామాల రైతాంగం షాద్‌నగర్ మార్కెట్‌కు కూరగాయలను తీసుకొస్తున్నారు. అయితే కూరగాయలను ఖరీదు చేయకుండా ఏజెంట్లు వ్యాపారాలను నిలిపివేశారు. పట్టణంలోని పాతగంజ్ మార్కెట్ సమీపంలోని మార్కెట్‌కు కూరగాయలను తీసుకెళ్లాలని కమీషన్ ఏజెంట్లు సూచిస్తున్నారు. రైతులు మాత్రం ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చిన నూతన మార్కెట్ యార్డుకే కూరగాయలు తీసుకొస్తామని చెబుతున్నారు. దీంతో కమీషన్ ఏజెంట్లు కొనడం లేదు. పంటను లాక్కొని బయట పారబోస్తున్నారు. ఈ వ్యవహారంతో బుధవారం సాయంత్రం తీవ్ర అలజడి రేగింది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.



Next Story