‘భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించగలిగింది’

by  |
‘భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించగలిగింది’
X

న్యూఢిల్లీ: చైనా సరిహద్దు వద్ద 20మంది జవాన్లు మరణించిన ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికారంలోని బీజేపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించుకోగలిగిందో, ప్రస్తుతం గాల్వాన్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రధాని మోడీ జాతిముందుకొచ్చి వివరించాలని డిమాండ్ చేశారు.

ఎల్ఏసీ సరిహద్దులో చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో ఒక అధికారి సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని మనదేశ ఆర్మీ ప్రకటించిన తర్వాతి రోజు సోనియా గాంధీ ఓ వీడియో మెస్సేజీలో ఈ ప్రశ్నలను మోడీ ప్రభుత్వం ముందుంచారు. 20 మంది జవాన్లు ఎందుకు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇంకా జవాన్లు ఎవరైనా అదృశ్యమయ్యారా? ఎంత మంది ఆర్మీ అధికారులు లేదా జవాన్లు సీరియస్‌గా ఉన్నారో వెల్లడించాలని అడిగారు.

ఈ ఆపత్కాలంలో కాంగ్రెస్ ఆర్మీ, జవాన్ల కుటుంబాలకు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఈ సందర్భంలో యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చి శత్రువును ఎదుర్కొంటారన్న నమ్మకం తనకు ఉన్నట్టు వివరించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ప్రణాళిక, పరిష్కారాలు ఏమి ఉన్నాయని అడిగారు.



Next Story