కాలినడకన కార్యాలయాలకు కలెక్టర్.. కనిపించని అధికారులు

by  |
కాలినడకన కార్యాలయాలకు కలెక్టర్.. కనిపించని అధికారులు
X

దిశ, నాగర్‌కర్నూల్: కార్యాలయాలకు వచ్చే సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలని, కార్యాలయ ఆవరణలో పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. గురువారం ఉదయం 10:15 గంటలకు కలెక్టర్‌ యల్‌.శర్మన్‌, డీఆర్వో మధుసూదన్ నాయక్‌తో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కాలినడకన ఆర్డీఓ, జిల్లా పరిషత్, ఎంపీడీవో, డీఈఓ, ఎంఈఓ, మహిళా సమైక్య, భవిత కేంద్ర కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్లపై మాస్కులు లేకుండా వెళ్తున్న ప్రజలకు, అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్న టీస్టాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. నాగర్ కర్నూలు ఆర్డీఓ కార్యాలయానికి 10 గంటల 16 నిమిషాలకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆఫీసులో ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ తప్ప ఎవరూ రాలేదు. అనంతరం హాజరు శాతాన్ని పరిశీలించారు. కార్యాలయ వాతావరణాన్ని పరిశీలించిన కలెక్టర్, వెంటనే క్లీన్ చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ, జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ సిబ్బంది ఎవరు లేరని గమనించారు. కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత 10:20 నిమిషాలకు సీఈవో నాగమణి వచ్చి కలెక్టర్‌ను కలిశారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని వెంటనే తొలగించి మొక్కలు నాటాలని ఆదేశించారు. డీఈఓ కార్యాలయాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాలను చూసి డీఈఓ కార్యాలయ సిబ్బందిని అభినందించారు. అనంతరం మండల విద్యాధికారి ఆఫీసును పరిశీలించారు. భవిత కార్యాలయంలో నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పాఠశాలలకు పంపిణీ చేశారో అడిగి తెలుసుకున్నారు. వెంటనే మండల పరిధిలోని అన్ని పాఠశాలకు అందజేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. జిల్లా మహిళా సమైక్య కార్యాలయం చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణం గ్రహించి వెంటనే తొలగించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాల సందర్శన అనంతరం కలెక్టర్ శర్మన్, డీఆర్ఓ మధుసూదన్ నాయక్ కాలినడకనే కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరారు.


Next Story

Most Viewed