టీచర్లపై కలెక్టర్ సీరియస్.. కారణం మొక్కలు

by  |
టీచర్లపై కలెక్టర్ సీరియస్.. కారణం మొక్కలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆరవ విడత హరిత హారంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉపాధ్యాయుల మెడకు ఉచ్చుగా చుట్టుకుంటోంది. హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లలో ఉపాధ్యాయులు విధిగా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు సరిపడా స్థలంతో పాటు ఇతర వసతులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం నిర్ధేశించిన సంఖ్యలో మొక్కలు నాటలేని పరిస్థితి నెలకొంది.

దీనికి బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ ఏకంగా డీఈఓ కు మొమో జారీ చేయడం ఉపాధ్యాయులలో వణుకు మొదలైంది. పట్టుమని వంద మంది నిల్చోలేని పాఠశాలల్లో వందల మొక్కలు ఎలా నాటాలని వారు మదన పడుతున్నారు. దీనికితోడు నాటిన మొక్కలకు ప్రభుత్వం ట్రీ గార్డులు సరఫరా చేయకుండానే వాటిని సంరక్షించాలనడం ఎంత వరకు సబబని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కనీసం ఇటుకలను పేర్చి రక్షణ చర్యలు తీసుకోవడం కూడా ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారడం, జిల్లాలోని చాలా చోట్ల పాఠశాలలకు ఎత్తైన ప్రహారీ గోడలు లేక పోవడం వారి పాలిట శాపంగా పరిణమించింది. పాఠశాలల పరిసర ప్రాంతాల పిల్లలు గోడలు దూకి ప్రాంగణంలో ఆటలాడుతుండడం, కొన్ని చోట్ల పశువులు మేయడం వంటి ఇతరత్రా కారణాలతో అవి నాటిన కొన్ని రోజులకే ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. దీనికి ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

వసతులు కల్పించకుండా బాధ్యులను చేస్తారా ..?

హరిత హారంలో భాగంగా మేము మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మాకు వసతులు క్పలించండి అని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో ప్రతి యేటా మొక్కలు నాటుతున్నారు. ఐతే వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో అవి కొన్నాళ్లకే చనిపోతున్నాయని, నీళ్లు, ట్రీ గార్డులు ఇవ్వకుండా మమ్ములను బాధ్యులను చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా పాఠశాలల్లో ప్రేయర్ చేయడానికే స్థలం కొరత ఉండగా వాటిల్లో మొక్కలు ఎక్కడ నాటేది, వాటిని ఎలా కాపాడేది తెలియడం లేదని వారు వాపోతున్నారు. దీనికి తోడు కొన్ని పాఠశాలల్లో వంద మొక్కలు నాటమని చెప్పి అధికారులే అరవై మొక్కలు సరఫరా చేశారని, అనంతరం మొక్కలు తక్కువ నాటారని మొమోలు ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పాఠశాలల కాంపౌండ్ వాల్ ను అనుసరించి ఉన్న షా బాద్ బండలను తొలగించి మొక్కలు నాటమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు, కరోనా సమయంలో పని వాళ్లు దొరకక ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్ తనికీలు చేసి మొమోలు జారీ చేయడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కలెక్టర్ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యాచరణ నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డీఈఓకు మెమో జారీ చేసిన కలెక్టర్

హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పని తీరు ఏ మాత్రం బాగా లేదని, ఈ విషయంలో అట్టడుగున ఉండడానికి గల కారణాలు సంజాయిషీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 4వ తేదీన డీఈఓ కు మెమో జారీ చేశారు. జిల్లా లోని ప్రతి మండలంలో కనీసం ఐదు పాఠశాలలు ఎంపిక చేసి వాటిల్లో మొక్కలు నాటాలని గతంలో ఆదేశాలు జారీ చేశామని, ఈ మేరకు మొక్కలు నాటారా ? లేదా ? అనేది పాఠశాలల డిప్యూటీ ఇన్ స్పెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు సంయుక్తంగా తనికీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ పాఠశాలలో ఎన్ని మొక్కలు నాటడానికి తీసుకవెళ్లారు, పెద్ద మొక్కలెన్ని ? చిన్న మొక్కలెన్ని, వాటిని నాటారా లేదా నివేదించే బాధ్యత వారికి అప్పగించారు. వారు ఇచ్చిన నివేధిక ఆధారంగా హరిత హారం కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని, మొక్కలు నాటడంలో పనితీరు సక్రమంగా లేని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ శ్వేతా మహంతి జిల్లా డీఈఓ వెంకటనర్సమ్మకు మెమో జారీ చేశారు.



Next Story

Most Viewed