వారికి మంచి చేయాలంటే ఆ శాఖతోనే సాధ్యం

by  |
వారికి మంచి చేయాలంటే ఆ శాఖతోనే సాధ్యం
X

దిశ, మహబూబ్‌నగర్: రెవెన్యూ శాఖలో రాణించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని, ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. నూతనంగా ఎంపికైన 32 మంది డిప్యూటీ తహసీల్దార్‌లతో ఆయన శుక్రవారం రెవెన్యూ కార్యాయలంలో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖకు ఎంతో చరిత్ర ఉందని, ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో, నైజాం కాలంలో రెవెన్యూ‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వివిధ రకాల శాఖలు, సంక్షేమ శాఖలు ఎన్ని వచ్చినా రెవెన్యూ శాఖ తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నదని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లు చట్ట ప్రకారం ఎంపికైన వారని, ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఒక రెవెన్యూ శాఖ ద్వారా సాధ్యం అవుతుంది అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు క్షేమంగా పంపించడంలో రెవెన్యూ శాఖ కృషి మరువలేనిదని అన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖపై వస్తున్న పలు అపోహలను తొలగించాల్సిన బాధ్యత నూతనంగా ఎంపికైన రెవెన్యూ ఉద్యోగులపై ఉందని ఆయన తెలిపారు. భూమి రికార్డుల నవీకరణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు మంచిపేరు వచ్చిందని, ఉద్యోగులకు కూడా ఇన్సెంటివ్‌గా ఇంక్రిమెంట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడమే కాకుండా డిపార్ట్మెంట్‌కు మంచి పేరు తీసుకు వచ్చేందుకు నూతన ఉద్యోగులు కృషి చేసినట్టయితే మళ్ళీ రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం వస్తుందన్నారు.


Next Story

Most Viewed