ఏడాదిలోపే సమగ్ర భూ సర్వే

by  |
ఏడాదిలోపే సమగ్ర భూ సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏడాదిలోపే సమగ్ర భూ సర్వేను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం కొత్త రెవెన్యూ బిల్లుపై శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే సర్వే చేయాల్సిందేనన్నారు. జిల్లాకో ఏజెన్సీతో భూమిని సర్వే చేయిస్తామని దీనికి అత్యాధునిక టెక్నాలజీ వాడుతామన్నారు. ఈ విషయంలో కావాలని గొడవలు పెట్టుకుంటే మాత్రం సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని కుండబద్ధలు కొట్టారు. కౌలుదారులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రైతు తనకు నచ్చిన వ్యక్తికి కౌలుకు ఇచ్చుకుంటాడని సీఎం అన్నారు.

హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు సంప్రదాయాలు వేరే విధంగా ఉండేవని, ఎన్టీఆర్ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేశారని తెలిపారు. రాష్ట్రంలో 2.75కోట్ల ఎకరాలు వ్యవసాయ, వ్యవసాయేతర భూమిగా ఉందన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగానే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని, కరోనా ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యం అయ్యిందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడటంతో పాటు చాలా దారుణాలు చూశామని, వీఆర్వోల దుర్మార్గాల నుంచి విముక్తి కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చామన్నారు.

భూమి శిస్తును ఎన్టీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భూమి శిస్తును వసూలు చేయడం లేదన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని సామాన్యుల కోసమే తీసుకువచ్చామని, అయితే దీనిపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రైతుబంధు పథకం తీసుకువచ్చింది రైతుల కోసమని స్పష్టం చేసిన సీఎం… రాష్ట్రంలో 25ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.11శాతమే అన్నారు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చని, తహసీల్దార్లు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

Read Also…

అక్టోబర్ 16నుంచి బతుకమ్మ ప్రారంభం..!


Next Story

Most Viewed