ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడాలి

by  |
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణాలు జరగాలని, స్వామివారికి సేవలు, పూజలు చేసే విషయంలో భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 6గంటల పాటు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ నిర్మాణ ప్రగతి పురోగతిపై హరిత గెస్ట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు.

యాదాద్రి ఆలయానికి రింగ్‌రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని, పచ్చనిచెట్లు వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో రింగ్‌రోడ్డును అత్యంత సుందరంగా తయారు చేయాలన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు ఉండాలని, ఆలయానికి ఆనుకొని ఉన్న గండిపేట చెరువును ప్రతి 2నెలలకోసారి కాళేశ్వరం జలాలతో నింపాలని సూచించారు. ఆలయ పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో ఉండాలని ఇందుకోసం పచ్చనిచెట్లను ఎక్కువగా పెంచాలి, స్పెషల్ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్‌గా తీర్చిదిద్దాలన్నారు.

టెంపుల్ సిటీలో 365క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో 200ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని, కల్యాణకట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని స్పష్టం చేశారు. బస్టాండ్ నుంచి గుడివరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుంచి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలన్నారు.

మూడు వారాల్లో రూ.75కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి 4వేలమంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టి, 5వేల కార్లు, 10వేల బైక్‌ల కోసం పార్కింగ్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed